కరోనా వ్యాక్సిన్ల కొరత: కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్, రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు వేసే సత్తా వుంది!
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ల కొరత కేంద్ర ప్రభుత్వం వైఫల్యమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాక్సినేషన్ కార్యక్రమంపైన ప్రజల నుంచి సలహాలను, సూచనలను ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్వీకరించారు మంత్రి. ఆస్క్ కేటీఆర్ పేరుతో కోనసాగిన ట్విట్టర్ సంభాషణలో మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Recommended Video

తెలంగాణలో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్..
తెలంగాణలో వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా కొనసాగుతోందన్నారు, ఓల్డ్ ఏజ్ హోంలలోనూ వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు 10 లక్షల మంది ప్రజలకు వ్యాక్సిన్ను వేసే పరిపాలనా పరమైన వ్యవస్థ అందుబాటులో ఉందని, అయితే దురదృష్టవశాత్తు ఆ మేరకు అవసరమైన వ్యాక్సిన్ సరఫరా లేదని వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత త్వరగా అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఉందని, కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వలన ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలకు 2 డోసుల వ్యాక్సిన్ అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనసాగిస్తున్నామని, ఇప్పటికే 13న లక్షల మందికి రెండో డోసు పూర్తి అయిందన్నారు. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మందికి వాక్సిన్ అందించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వృథా తక్కువగా ఉందన్నారు.

కేంద్రం, ప్రైవేటుకు అధిక వ్యాక్సిన్లు.. రాష్ట్రాల పరిస్థితి..
భారతదేశ జనాభా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించాలంటే 272 కోట్ల వాక్సిన్ అవసరం అవుతాయని, దీనికి సంబంధించి 150 రూపాయలకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన 35 వేల కోట్ల రూపాయలను ఉపయోగించాలని, కానీ ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు 85 శాతం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయని మిగిలిన 15 శాతంలో రాష్ట్రాలకు తక్కువ రేటు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఎక్కువ రేటు నిర్ణయించడంతో కంపెనీలు కూడా ప్రైవేటు వర్గాలకే అమ్మేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో వారితో రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడలేకపోతున్నాయన్నారు.

ఒక ప్రణాళిక లేకుండానే కేంద్రం..
థర్డ్ వేవ్ నేపథ్యంలోనూ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరాకు సంబంధించిన ఒక ప్రణాళిక ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ నెలకి పది కోట్లకు మించి ఉత్పత్తి చేయలేవని, అయితే త్వరలోనే దేశ జనాభాలో 80శాతం ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల వయసున్న ప్రజలకు ఏ విధంగా రెండు డోసులు అందుతాయో కేంద్ర ప్రభుత్వం తెలపాలన్నారు.

విదేశాల నుంచి వ్యాక్సిన్లు తెప్పించాలన్న కేటీఆర్.. మలయాళీ భాషపై..
దేశీయంగా వ్యాక్సిన్ సరఫరా తగినంత లేకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం అమెరికా కెనడా డెన్మార్క్ నార్వే వంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల వ్యాక్సిన్లకు సంబంధించి ఆయా దేశాలతో వెంటనే చర్చను ప్రారంభించి వాటిని భారతదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించాలని కేటీఆర్ సూచించారు. అమెరికా, కెనడా లాంటి దేశాలు తమ పౌరుల కోసం ఇప్పటికే దేశ జనాభాకు మించి వ్యాక్సిన్లను ఆర్డర్ చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక ఢిల్లీలోని ఓ ఆస్పత్రి తమ ఆస్పత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది మలయాళంలో మాట్లాడుకోవద్దని ఆదేశాలు జారీ చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. మాతృభాషలో మాట్లాడవద్దని చెప్పడం సరికాదన్నారు. కాగా, మలయాళీ వైద్య సిబ్బంది భారీ నిరసనలతో ఆస్పత్రి యాజమాన్యం దిగివచ్చింది. తమ ఆదేశాలను వెనక్కి తీసుకుంది.












Click it and Unblock the Notifications