నారా లోకేశ్కు మంత్రి కౌంటర్.. మీరెవరంటూ కాస్తా ఘాటుగానే..?
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. గోదావరి, కృష్ణా నదుల్లో నికర, మిగులు, వరద జలాల వాటా తేలకముందే బనకచర్ల ప్రాజెక్టును నిర్మించడానికి తాము అంగీకరించబోమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడిన ఆయన, గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, రాష్ట్ర వాటాలను త్వరలో తేల్చాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.
తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే తాము అడ్డుకోలేదని, ఇప్పుడు వృథాగా పోతున్న నీటిని ఉపయోగించుకుంటామంటే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఏపీ వాదనను ఆయన ఖండించారు. గోదావరిలో తెలంగాణకు ఉన్న కేటాయింపుల మేరకు మేము ప్రతిపాదనలు చేసుకుంటున్నాం. మా వాటాలో మేము ప్రాజెక్టులు కట్టుకుంటే ఆపడానికి, అడ్డుకోవడానికి మీరెవరు?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉందని ఏది చేసినా చెల్లుతుందనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు కుంగిపోవడం బీఆర్ఎస్ వైఫల్యమేనని శ్రీధర్ బాబు విమర్శించారు. ఇంజనీర్లకు బదులు టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ప్రణాళికలతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ (NDSA) ఇచ్చిన సూచనల మేరకే బ్యారేజీల విషయంలో ముందుకు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications