తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు బిగుస్తున్న ఉచ్చు ! .. ఏకంగా అధికారులతో కుమ్మక్కై..
తెలంగాణ ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కష్టాలు కొని తెచ్చున్నారా.. ? తాను ఒకటి తలచి చేస్తే .. ఇప్పుడు అది మరోలా తయారైందా? ఎన్నికల సమయంలో చేసిన తప్పిదం ఆయన మెడకు చుట్టుకునేలా ఉందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీంతో ఎన్నికల కమిషన్ చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
పాత అఫిడవిట్ స్థానంలో కొత్తది..
2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది. 14.11.2018న శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిని ఎన్నికల కమిషన్ వెంటనే ఆ అఫిడవిట్ పత్రాలను తమ వెబ్ సైట్లో అప్లోడ్ చేసింది. అయితే దాని స్థానంలో ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు కొత్తది వెబ్సైట్లో ప్రత్యక్షమైంది. లోపాలు ఉన్న మొదటి అఫిడవిట్ను వెబ్ సైట్ నుంచి తొలగించినట్లు తేలింది.
తెలంగాణ ఎన్నికల అధికారులతో కుమ్మక్కై
తనపై అనర్హత వేటు పడుతుందన్న భయంతో దానిని తప్పించుకునేందుకు తప్పులు సవరించిన అఫిడవిట్ను తెలంగాణ ఎన్నికల అధికారులతో కుమ్మక్కై కొత్తదానిని అప్ లోడ్ చేసియించినట్లు శ్రీనివాస్ గౌడ్పై ఆరోపణలు వచ్చాయి. అధికారులతో కలిసి ఈసీ వైబ్సైట్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల అధికారలతో నివేదిక తెప్పించుకుంది.
వెబ్సైట్ ట్యాంపరింగ్ నిజమే?
అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ట్యాంపరింగ్ వ్యహారం నివేదిక పంపిన కొన్ని రోజులకే సీఈవో శశాంక్ గోయల్ బదిలీపై వెళ్లారు. ఈసీ వెబ్సైట్ ట్యాపరింగ్ జరిగిన మాట నిజమేనన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ విచారణలో ఈసీ వైబ్ ట్యాంపరింగ్ నిజమేనని తేలితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆయనకు సహకరించిన ఎన్నికల అధికారులపై కూడా ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.