తెలంగాణలో రెండు లక్షలకు చేరువ: ఇంకొక్కరోజే: కరోనా ప్రభావం తగ్గుముఖం? యాక్టివ్ కేసుల్లో
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయే తప్ప.. ఆశించిన స్థాయిలో క్షీణించట్లేదు. దాని ప్రభావం- మొత్తం కేసులపై పడుతోంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. రోజువారీగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఇప్పుడు కనిపిస్తోన్న వేగం కొనసాగితే. ఇంకొక్కరోజులో రెండు లక్షల మార్క్ను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. మరణాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. తాజాగా 10 మంది మరణించారు.
Recommended Video
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,949 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 2,366 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,99,276కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,70,212గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1163కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు 27,901గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 22,816 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. 30 వేల కంటే తక్కువగా యాక్టివ్ కేసులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి. 30 వేల కంటే దిగువకు నమోదైన తరువాత.. ఇక మళ్లీ ఆ మార్క్ను అందుకోవట్లేదు. కరోనా బారిన పడి చికిత్స పొందుతోన్న వారి సంఖ్య మున్ముందు మరింత తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనివే. కొత్తగా 291 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
జిల్లావారీగా ఆదిలాబాద్-24, భద్రాద్రి కొత్తగూడెం-71, జగిత్యాల-45, జనగామ-31, జయశంకర్ భూపాలపల్లి-24, జోగుళాంబ గద్వాల-22, కామారెడ్డి-56, కరీంనగర్-114, ఖమ్మం-85, కొమరంభీమ్ ఆసిఫాబాద్-16, మహబూబ్ నగర్-31, మహబూబాబాద్-36, మంచిర్యాల-30, మెదక్-29, మేడ్చల్ మల్కాజ్గిరి-150, ములుగు-28, నాగర్ కర్నూలు-28, నల్లగొండ-124, నారాయణపేట్-6, నిర్మల్-25, నిజామాబాద్-66, పెద్దపల్లి-43, రాజన్న సిరిసిల్ల-55, రంగారెడ్డి-156, సంగారెడ్డి-42, సిద్ధిపేట్-76, సూర్యాపేట్-65, వికారాబాాద్-26, వనపర్తి-25, వరంగల్ రూరల్-32, వరంగల్ అర్బన్-63, యాదాద్రి భువనగిరి-34 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 51,623 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 32,05,249కి చేరుకుంది. ప్రతి 10 లక్షల మందికీ 86,116 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇప్పటిదాకా పూర్తి చేసిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఇదో రికార్డు.