తెలంగాణలో రెవిన్యూ లోటు రూ.5,392 కోట్లు: కాగ్ రిపోర్ట్
హైదరాబాద్: కాగ్ నివేదిక తెలంగాణ ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం సుమారు రూ.5,392 కోట్ల రెవిన్యూలోటుతో ఉందని కాగ్ తేల్చింది. ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని కాగ్ అభిప్రాయపడింది.
2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,392 కోట్ల రెవిన్యూ లోటు ఉంటే, రూ.1386 కోట్లు రెవిన్యూ మిగులుగా చూపారని కాగ్ ప్రభుత్వం తీరును బయటపెట్టింది. పద్దుల నమోదు సక్రమంగా లేదని కాగ్ అభిప్రాయపడింది.
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ మారాల్సిన అవసరం ఉందని కాగ్ తన నివేదికలో ప్రభుత్వానికి సూచనలు చేసింది. రాష్ట్రానికి రుణాలు పెనుభారమయ్యే అవకాశం కూడ లేకపోలేదనే అభిప్రాయాన్ని కాగ్ వ్యక్తం చేసింది. అయితే రుణాల చెల్లింపుకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉండనుందని కాగ్ ప్రకటించింది.
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల వ్యయానికి సంబంధించి చట్టబద్దత ఉన్నా సగానికి పైగా నిధులు వ్యయం కావడం లేదనే అభిప్రాయాన్ని కాగ్ వ్యక్తం చేసింది.
సగానికి సగం నిధులు ఖర్చు చేయకుండా మిగిలిపోయి ఉన్నాయని కాగ్ ఎత్తి చూపింది. మిషన్ కాకతీయ పథకం కింద మార్గదర్శకాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని కాగ్ అభిప్రాయపడింది. వివిధ శాఖల్లో వందల కోట్లలో నిధులను ఖర్చు చేయలేదని కాగ్ స్పష్టం చేసింది. పీడీ ఖాతాల్లో రూ.10వేల కోట్లు నిధులను ఖర్చు చేయకుండా ఉన్న విషయాన్ని కాగ్ ప్రస్తావించింది.
జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిధులు ఏ సంవత్సరంలో కూడ పూర్తిగా ఖర్చు చేయలేదని కాగ్ అభిప్రాయపడింది.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది సామాజిక రంగంలో వ్యయం చేస్తున్న మొత్తం రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని కాగ్ అభిప్రాయపడింది. 2016-17 మొత్తం వ్యయంలో సామాజిక రంగం, అభివృద్దికి ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారని కాగ్ స్పష్టం చేసింది.
నిర్భంధ విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా బడి మానేస్తున్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉందని కాగ్ అభిప్రాయపడింది ఎస్సీ, ఎస్టీ బాల బాలికల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని కాగ్ తన నివేదికలో అభిప్రాయడింది.
ఐటీతో పాటు పరిశ్రమలకు కేటాయించిన భూములు నిరూపయోగంగా ఉన్న విషయాన్ని కాగ్ ఎత్తి చూపింది. మరోవైపు తెలంగాణసీపీడీసీఎల్ సంస్థ నిర్ణీత సీలింగ్ కంటే ఎక్కువ ధరలకు విద్యుత్ను కొనుగోలు చేసిందని కాగ్ అభిప్రాయపడింది . దీని కారణంగా 2012 నుండి 2017 మధ్య కాలంలో సుమారు రూ.5820 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడిందని కాగ్ తేల్చి చెప్పింది.
నీటిపారుదల రంగానికి చెందిన ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కూడ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించింది. రెండేళ్ళలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు పదేళ్ళు దాటినా కూడ పూర్తి కాలేదని కాగ్ అభిప్రాయపడింది.
భూ కేటాయింపుల్లో లోపాలున్నాయని కాగ్ అభిప్రాయపడింది. దీని కారణంగానే ఐటీ పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం లేదని కాగ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.