తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్!
నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భలపై కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో నేడు సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హన్మకొండ, వరంగల్, జనగామ తదితర ప్రాంతాలలో ఈ రోజు ఉదయం భారీ వర్షం నమోదైంది. ఈ నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు.

రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఒకటి రెండు సార్లు గట్టిజల్లులు పడవచ్చని అంచనా వేశారు. ఇక రేపు కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖాధికారులు చెప్తున్నారు.రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
హైదరాబాద్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతోపాటు ఒకటి రెండు సార్లు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గతం వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
ప్రజలు అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసు, పరిపాలనా యంత్రాంగం సూచిస్తోంది. రైతులు పొలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులు సలహా ఇస్తున్నారు. వాతావరణ కేంద్రం తదుపరి రోజుల్లోనూ పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తుందని తెలిపింది. ప్రజలు అధికారిక సమాచారాన్ని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.













Click it and Unblock the Notifications
