కాళేశ్వరానికి పోటెత్తిన వరద: పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్, హెలికాప్టర్ ద్వారా రైతుల రెస్క్యూ
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. మరోవైపు, నీటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్ట్కు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
కాళేశ్వరం వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం కూడా వెల్లడించింది. కాళేశ్వరం వద్ద నీటిమట్టం 107.56 మీటర్లకు చేరిందన్న కేంద్ర జలసంఘం... కాళేశ్వరం వద్ద వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీకి 22లక్షల 15వేల 760 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు
గోదావరి పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్
మరోవైపు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అంతకంతకూ వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. కంట్రోల్ రూమ్, సీఆర్పీఎఫ్ కార్యాలయాన్ని వరద చుట్టుముట్టింది. అన్నారం బ్యారేజీ ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 14లక్షల 77వేల 975 క్యూసెక్కులుగా ఉంది. మహాదేవపూర్, కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కాగా, పుష్కర ఘాట్లను వరద నీరు ముంచెత్తి ఇళ్లలోకి నీరు చేరింది. భారీ వరదల కారణంగా నివాస ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాళేశ్వరం ఘాట్ వద్దకు ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 15.900 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. మహదేవపూర్ పరిధి గోదావరి తీర ప్రాంతాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అన్నారం, చండ్రుపల్లి, నాగపల్లి, మద్దులపల్లి, పల్గుల, కుంట్లం, కన్నెపల్లి, బీరాసాగర్ గ్రామాలు జలమయమయ్యాయి. ఏటూరునాగారంలో శివాలయం వీధి, ఓడవాడలోకి వరద ముంచెత్తింది. బెస్తవాడ, ఎస్సీ కాలనీ, కుమ్మరివాడ, దామెరకుంట, లక్ష్మీపూర్, గుండ్రాత్పల్లి, మల్లారం వరద గుప్పిట్లోనే చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మేడిగడ్డ కంట్రోల్ రూమ్లో చిక్కుకున్న ఇంజినీర్లు
భారీ వరదతో కాళేశ్వరం పంప్హౌజ్ నీట మునిగిపోయింది. పంప్ హజ్లోకి క్రమంగా నీరు చొచ్చుకువచ్చింది. దీంతో పంప్ హౌజ్లోని 17 మోటర్లూ నీటిలో మునిగాయి. 2టీఎంసీ, 1టీఎంసీ నీటిని తోడే ఈ పంపులు మునిగిపోయాయి. కంట్రోల్ రూం వరకూ వరద చేరుకోవడంతో.. పంప్ హౌజ్ ప్రమాద స్థాయికి చేరుకుంది.వరద ఉద్ధృతి గమనించి.. పంప్ హౌజ్ను ఇంజినీర్లు ముందుగా ఖాళీచేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. బ్యారేజీ కంట్రోల్ రూం, సీఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయాన్ని వరద చుట్టుముట్టడంతో.. ఇంజినీర్లు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వరదల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
మరోవైపు, తెలంగాణ, మహారాష్ట్ర వంతెన ఆనుకుంటూ గోదావరి ప్రవహిస్తోంది.
ఇది ఇలావుండగా, పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో నీటమునిగిన సరస్వతీ పంప్ హౌస్ వరదనీటిలో మునిగిపోయింది. 12 మోటర్లు నీటిలోనే ఉన్నాయి.
రైతులను హెలికాప్టర్ ద్వారా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
వదరనీరు చుట్టుముట్టడంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఓడ్డు సోమనపల్లిలో వాటర్ట్యాంకు మీద చిక్కుకుపోయిన ఇద్దరు రైతులను సహాయక బృందాలు రక్షించాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెలికాప్టర్ తెప్పించి.. వారి ప్రాణాలను కాపాడారు.తమ పశువుల కోసం బుధవారం సాయంత్రం ఆ ఇద్దరు రైతులు పొలాల వద్దకు వెళ్లగా తిరుగు ప్రయాణంలో గోదావరి నది ప్రవాహం చుట్టు ముట్టింది. దీంతో బయటకు రాలేక వాటర్ట్యాంకు ఎక్కి ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో.. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ను రప్పించి ఇద్దరిని సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. రైతులని రక్షించినందుకు గ్రామస్థులు ప్రజలు ఎమ్మెల్యే బాల్క సుమన్కు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications