‘మంకీపాక్స్’పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం, మార్గదర్శకాలు జారీ: లక్షణాలివే
హైదరాబాద్: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మంకీపాక్స్ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

మంకీపాక్స్పై వైద్యులు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసిన సర్కారు
ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి మంకీపాక్స్ కు సంబంధించిన లక్షణాలపై అవగాహన కల్పించడంతోపాటు వివిధ రకాల నిర్ధరణ పరీక్షలు చేయడం, మంకీపాక్స్ కేసులను గుర్తించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపింది. అంతేగాక, మంకీపాక్స్ లక్షణాలున్న, నిర్ధరణ అయిన బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కేంద్రం సూచించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా వచ్చే మంకీపాక్స్ లక్షణాలున్న బాధితుల నమూనాలను పరీక్షించేందుకు హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రి సహా మొత్తం వైరాలజీ ల్యాబ్లకు కేంద్రం అనుమతించింది.

మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి గురించి..
మంకీపాక్స్ అనేది స్మాల్ఫాక్స్ కుటుంబానికి చెందిన ఒక వైరల్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా ఈ వ్యాధి మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లోనే అధికంగా వ్యాప్తి జరుగుతుంది. కానీ, ఇప్పుడు అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరగా ఉండటం, శారీరకంగా కలవడం వల్ల మంకీపాక్స్ అధికంగా వ్యాపించే అవకాశం ఉంది. శృంగార కలయిక వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది.

మంకీపాక్స్ను గుర్తించడం ఎలాగంటే?
మంకీపాక్స్ వచ్చిన వారికి దద్దర్లు వస్తాయి. దీంతోపాటు జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చంకల్లో, గజ్జల్లో లింపు గ్రంథుల్లో వాపు, నీరసం, చలి, చెమటపట్టడం, గొంతునొప్పి, దగ్గు తదితర లక్షణాలున్న వారి నుంచి నమూనాలను సేకరించాలి. కాగా, మనదేశంలో తొలి మంకీపాక్స్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదైంది. దీంతో దేశ వ్యాప్తంగా మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.












Click it and Unblock the Notifications