'మొంథా' తుపాను బాధితులకు సీఎం గుడ్ న్యూస్.. నిధులు విడుదల..
మొంథా తుపాను కారణంగా భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయింది. భారీ వర్షాల కారణంగా 16 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో మొంథా తుపాను విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షలాది ఎకరాల పొలాలు నీటమునిగాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుపాను బాధితులకు రాష్ట్ర సర్కార్ తక్షణ ఆర్థిక సాయం మంజూరు చేసింది.
తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు గాను రూ. 12. 99 కోట్లను రిలీజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 15 జిల్లాల్లోని 8,662 ఇళ్లకు రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రిలీజ్ చేసింది. ఈ మొత్తాన్ని జిల్లా స్థాయి అధికారులు బాధిత కుటుంబాలకు అందించనున్నారు. ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్లు రాష్ర్ట ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూలు, ములుగు, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు నిధులు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇక తెలంగాణలోని 14 జిల్లాల్లో మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపినట్లు ఆర్ అండ్ బీ శాఖ అంచనా వేసింది. మొత్తం 334 ప్రాంతాల్లో 230 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఇక మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, అలాగే వరద ప్రవాహంతో నీట మునిగిన ఇంటికి రూ. 15 వేలు, ఇళ్లు పూర్తిగా దెబ్బతిని నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications