ఏపీ చరిత్రకు చెల్లుచీటి!: టీపీఎస్సీలో తెలంగాణ చరిత్ర
హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించే పరీక్షల విధివిధానాల్లో సరికొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పాఠ్యాంశాలైన ఏపీ చరిత్రకు సంబంధించిన అంశాల స్థానంలో తెలంగాణ చరిత్ర అంశాలు చేరనున్నాయి.
టీఎస్పీఎస్సీ జారీ చేయనున్న నోటిఫికేషన్లకు ఏయే కేటగిరీ పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి, ప్రశ్నాపత్రాల్లో ఏయే అంశాల నుంచి ప్రశ్నలు ఇవ్వాలి, ఇందుకు సబంధించి సిలబస్ ఏ విధంగా ఉండాలనే అంశాలపై టీఎస్పీఎస్సీ నియమించిన రివ్యూ కమిటీ దృష్టి సారించింది. వీటిపై కమిటీ సభ్యులు కసరత్తు చేస్తున్నారు.
కమిటీలో చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ సహా 27మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో మళ్లీ రెండు సబ్ కమిటీలుగా ఏర్పడి పని చేయనున్నాయి. ఇందులో స్కీమ్ ఆఫ్ సిలబస్, పరీక్షలపై తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ఆచార్య కోదండరాం నేతృత్వంలోని కమిటీ పని చేస్తుంది.
మరో కమిటీ మాజీ వీసీ లింగమూర్తి నేతృత్వంలో పరీక్షల నిర్వహణలోని సాంకేతిక అంశాలపై దృష్టి సారించనుంది. ఈ రెండు సబ్ కమిటీలు హరగోపాల్ నేతృత్వంలో శుక్రవారం తొలి సమావేశం కానున్నాయి.
సిలబస్ రివ్యూలో ప్రధానంగా తెలంగాణ సామాజిక, సాంస్కృతిక నేపథ్యం, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, నైసర్గిక స్వరూపం, తెలంగాణ సాహిత్యం, ఈ ప్రాంతానికి చెందిన పోరాట యోధులకు సంబంధించిన తదితర అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చే అవకాశముంది. ఏపీ చరిత్ర, నైసర్గిక స్వరూపం, భౌగోళిక అంశాలను తొలగించే అవకాశముంది. పాఠ్యాంశాలు రిపీట్ కాకుండా ఉండే విధంగా కమిటీ దృష్టి సారించనుంది. ఈ నెల 30 లోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంది.