ఇక తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు అంగరంగ వైభవంగా ఆరంభం కాబోతోంది. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా ప్రఖ్యాతి చెందిన కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు తరలివస్తున్నారు. ఈ మధ్నాహ్నం 1: 30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు.

మరోవంక- రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. అన్ని జిల్లా కేంద్రాల్లో దీనికి సంబంధించిన ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మంగళవారం నాడు వాడవాడలా విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టడానికి చురుగ్గా పనులు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని ఆదేశించింది. హైదరాబాద్ సచివాలయంలో స్థాపితమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోలివుండేలా అవి ఉండాలని సూచించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు జీవో విడుదల చేశారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఒకేసారి తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఉండాలని రామకృష్ణారావు సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విగ్రహావిష్కరణ ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. దీనికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోవంక- ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ సచివాలయాన్ని లేజర్ లైట్లతో అలంకరించారు.












Click it and Unblock the Notifications