సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం -తెలంగాణలో సాగు భూముల డిజిటల్ సర్వే -ఈనెల 11 నుంచి పైలట్
తెలంగాణలోని ప్రతి అంగుళం భూమిని డిజిటలైజేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 11వ తేదీ నుంచి రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే ప్రారంభం కానుంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద 27 గ్రామాల్లో మొదటగా డిజిటల్ సర్వే చేపట్టనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి 3 గ్రామాలను, మిగతా 24 గ్రామాలను 24 జిల్లాల నుంచి ఎంపిక చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భూతగాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
భూతగాదాలు లేని తెలంగాణే లక్ష్యం
''రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణ కోసమే ధరణి పోర్టల్ ను అమలులోకి తెచ్చినం. భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకొని, వ్యాపారం కోణం లోంచి మాత్రమే కాకుండా సర్వేను రైతులకు సేవ చేసే ఉద్దేశ్యంతో సామాజిక సేవగా భావించి సర్వే నిర్వహించండి...'' అని సర్వే ఏజెన్సీలకు సీఎం పిలుపునిచ్చారు.
పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాలల్లో, అంటే సమస్యలు లేని సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో అనుభవాన్ని గ్రహించాలన్నారు. తద్వారా పూర్తి స్తాయి సర్వేకు విధి విధానాలను ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశమున్నదని సీఎం అన్నారు.
ప్రజల భూములకు రక్షణ
''తెలంగాణను సాధించుకుని అన్ని రంగాలను తీర్చి దిద్దుకుంటున్నం. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి నీల్లందిస్తున్నం. తెలంగాణ ఇవ్వాల పంజాబ్ ను మించి ధాన్యాన్ని పండించే పరిస్థితికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో భూములకు ధరలు కూడా పెరుగుతున్నవి. ప్రజల భూములకు రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మధ్య దళారీలు లేకుండా సామాన్య రైతును పీడించే వ్యవస్థలను తొలగించి పూర్తి పారదర్శకంగా వుండే విధంగా ధరణి పోర్టల్ ను ప్రభుత్వం రూపొందించింది. అన్ని అవాంతరాలను అధిగమించి ధరణి పోర్టల్ అద్భుతంగా పనిచేస్తున్నది. తమకు పీడింపులు లేకుండా రిజిష్ట్రేషన్ తదితర భూ లావాదేవీలు జరుగుతున్నాయని, ప్రజల నుంచి ప్రభుత్వం ప్రశంసలు అందు కుంటున్నది'' అని సీఎం తెలిపారు.
రైతుల భూముల్లో ఇంచు కూడా తేడా రావద్దు
గ్రామాల్లో తగాదాలు లేని విధంగా ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ వ్యవహారాలు చక్కబడిన నేపథ్యంలో డిజిటల్ సర్వే నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని సీఎం స్పష్టం చేశారు. డిజిటల్ సర్వే నిర్వహించే విధి విధానాల గురించి సీఎం సర్వే ఏజెన్సీ ప్రతినిధులతో చర్చించారు. వారి కార్యాచరణ గురించి కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల భూముల్లో ఇంచు కూడా తేడా రాకుండా కొలతలు వచ్చే విధంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సర్వే చేపట్టాలని వారికి సూచించారు. తేడాలు రాకుండా సర్వే చేయాల్సిన బాధ్యత సర్వే ఏజెన్సీలదేనని, ఏమాత్రం అలసత్వం వహించి నిర్లక్యం చేసి తప్పులకు తావిచ్చినా, చట్ట పరమైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదని సీఎం సర్వే ఏజెన్సీల ప్రతినిధులకు స్పష్టం చేశారు.
గ్రామాల్లో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న భూ సర్వే విధానంలో అవలంబిస్తున్న టీపన్ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ ప్రజలతో గ్రామ సభలను నిర్వహించి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సర్వే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కావాల్సిన సహకారం ఏజెన్సీలకు అందిస్తుందని, సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు అందుబాటులో వుంటూ సర్వే ఏజెన్సీలకు సహకరిస్తారని సీఎం చెప్పారు. కాగా సర్వే పూర్తి బాధ్యత ఏజెన్సీలదేనన్నారు.
మోదీ సర్కారుపై వ్యాక్సిన్ పిడుగు -పూర్తి డేటా హిస్టరీ ఇవ్వండన్న సుప్రీంకోర్టు -అసాధారణ ఆదేశాలు