రోడ్డు ప్రమాద బాధితుల కోసం సర్కార్ భారీ నిర్ణయం!
రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగినప్పుడు బాధితుడి ప్రాణం నిలవాలంటే కావాల్సింది సానుభూతి కాదు.. సమయానికి అందే సరైన వైద్యం. డబ్బు లేకనో, ఆసుపత్రుల చుట్టూ తిరగలేకనో ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'క్యాష్లెస్ ట్రీట్మెంట్' (Cashless Treatment) పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.1.50 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందనుంది.
గతేడాది కేంద్రం ప్రయోగాత్మకంగా చండీగఢ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగా.. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలోనూ ఇది అందుబాటులోకి రానుంది. దీని కోసం ప్రత్యేకంగా 'మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్' నుండి నిధులను వెచ్చిస్తారు. బాధితుడు ఏ వర్గానికి చెందినవాడైనా, అతడి వద్ద ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా.. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలో చేరితే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్యం అందుతుంది.

ఆరోగ్యశ్రీ (Telangana Aarogyasri) నెట్వర్క్తో అనుసంధానం
రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యతను ఆరోగ్యశ్రీ ట్రస్టు తీసుకుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రమాదకరమైన 'బ్లాక్ స్పాట్స్'ను అధికారులు గుర్తించారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉండేలా.. మొదటి విడతలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోని 500కు పైగా ఆసుపత్రులను దీనికి అనుసంధానిస్తున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఈ గొడుగు కిందకు తీసుకువస్తారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను గుర్తించిన ఆసుపత్రులకు తరలించేలా 108 అంబులెన్స్ల కాల్ డేటాను విశ్లేషించి వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.
పోలీసు - రవాణా - వైద్యశాఖల 'త్రివేణి సంగమం'
ఈ పథకం విజయవంతం కావడానికి మూడు కీలక శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి. పోలీసు శాఖ ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు e-DAR (e-Detailed Accident Report) ద్వారా కేసు నమోదు చేసి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. వైద్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రపంచ బ్యాంకు నుండి ₹1,000 కోట్ల రుణాన్ని కూడా సేకరించబోతున్నారు. ఇక రవాణా శాఖ అన్ని అర్హత ఉన్న ఆసుపత్రుల్లో ఈ స్కీమ్ అమలయ్యేలా పర్యవేక్షిస్తుంది.
మరణాల రేటుకు 'బ్రేక్'!
ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను 'గోల్డెన్ అవర్' అంటారు. ఆ సమయంలో బాధితుడికి వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం 80% ఎక్కువగా ఉంటుంది. కానీ, ఫీజులు కట్టలేమనో లేదా ప్రమాద కేసు అని భయపడి ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను చేర్చుకోవడానికి వెనుకాడుతుంటాయి. ఈ కొత్త పథకంతో ఆ అడ్డంకులు తొలగిపోతాయి. ఆసుపత్రికి డబ్బుల గ్యారెంటీ ఉండటం, బాధితుడికి ఉచిత చికిత్స అందడంతో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications