వైద్య శాఖకు ఇదో అప్రదిష్ట: నార్మల్ డెలివరీలు డల్..సిజేరియన్లు ఫుల్ !!
సాధారణ ప్రసవాలు చెయ్యాలని ఎంత చెప్పినా సరే వైద్యులు, అటు నొప్పులు భరించలేక కొందరు సిజేరియన్ ల వైపే మొగ్గు చూపుతున్నారు. డెలివరీలు పెంచాలన్న లక్ష్యంతో కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు ,డబ్బు సంపాదన కోసం చాలా ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వాకంతో తెలంగాణా రాష్ట్రం సిజేరియన్లలో టాప్ ర్యాంక్ సాధించింది. కారణాలేవైనా రాష్ట్రంలో విపరీతంగా సిజేరియన్లు పెరగటం తెలంగాణా వైద్య శాఖను అప్రదిష్ట పాలు చేస్తుంది.
హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విడుదల చేసిన రిపోర్ట్లో షాకింగ్ విషయం
సిజేరియన్లలో టాప్ స్థానంలో నిలిచింది తెలంగాణా రాష్ట్రం . రాష్ట్రంలో సగటున 100 మందికి 50 మందికి పైగానే సిజేరియన్లు చేస్తున్న పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలో ఉంది . దేశంలో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ గత సంవత్సరం టాప్ ర్యాంక్ ను సాదించింది. ఇక ఆ పరంపర ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు కొనసాగిస్తుంది. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విడుదల చేసిన రిపోర్ట్లో తెలంగాణాలో నార్మల్ డెలివరీలు చాలా తక్కువగా జరుగుతున్నాయని , సిజేరియన్ లే ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడైంది.
సిజేరియన్లలో తెలంగాణా రాష్ట్రం టాప్
2019-2020వ సంవత్సరంలో 50.2 శాతం డెలివరీలు సిజేరియన్ల ద్వారానే జరిగినట్టు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వెల్లడయ్యింది. అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆ ట్రెండ్ చాలా ఎక్కువైంది. గత సంవత్సరం మొత్తం 2,48,354 డెలివరీలు ప్రభుత్వాస్పత్రుల్లో జరిగితే, అందులో 43.9 శాతం డెలివరీలు సిజేరియన్లే అని నివేదిక తేల్చింది. . ప్రైవేటు హాస్పిటళ్లలో సిజేరియన్లు 57.3 శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.
నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యం
రాష్ట్రంలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు గత సంవత్సరం నుండి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా అవి సత్ఫలితాలను ఇవ్వలేదు. ఫలితం శూన్యంగా మారింది.అందుకు కారణం లేకపోలేదు . చాలా మంది గర్భిణీ మహిళలకు నార్మల్ డెలివరీపై ఉన్న భయాలు, అపోహలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది సిజేరియన్లకే మొగ్గు చూపుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న డెలివరీల్లో సగానికిపైగా ప్రభుత్వాస్పత్రుల్లోనే జరుగుతున్నా అక్కడ కూడా డెలివరీల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్దేశించటంతో సిజేరియన్లు చేస్తున్నారు.
ఆందోళనకరంగా నివేదిక .. సిజేరియన్లను తగ్గించే యత్నం చెయ్యాల్సిందే
గత రెండు నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీల్లో దాదాపు మూడో వంతు సిజేరియన్లే చేసినట్టు తెలుస్తుంది .మొత్తంగా 16 జిల్లాల్లో రాష్ర్ట సగటు 50.2% కన్నా ఎక్కువ సిజేరియన్లు జరుగుతున్నట్టు హెచ్ఎంఐఎస్ రిపోర్ట్ పేర్కొంది.ఇక ఈ నివేదిక ఆందోళన కలిగిస్తుంది. నార్మల్ డెలివరీలే ఆరోగ్యం అని భావిస్తూ ప్రభుత్వం నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని చెప్తున్నా అటు సర్కార్ ఆస్పత్రులలోనూ , ప్రైవేట్ ఆస్పత్రులలోనూ సిజేరియన్లే జరుగుతుండటం గమనార్హం . ఇక ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఈ కడుపు కోతల సంఖ్య తగ్గించాల్సిన అవసరం ఉంది.