బ్రాండ్ తెలంగాణా.. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్!
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. బ్రాండ్ తెలంగాణ'కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టంగా సూచించారు. ప్రతి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను పరస్పరం అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు, టూరిజం స్పాట్లను అనుసంధానం చేసే ప్లాన్
ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజం కేంద్రాలు, హస్తకళల గ్రామాలు, జల పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల సందర్శకులు ఒకే ప్రయాణంలో వివిధ రకాల అనుభవాలను పొందగలుగుతారని అన్నారు.
పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు.

ప్రత్యేక పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక
రహదారులు, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీటి ఏర్పాట్లు, శుభ్రమైన మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, పరిశుభ్రత, స్పష్టమైన సూచిక బోర్డులు, ఇతర సందర్శకుల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ప్రతి ప్రత్యేక పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక, బాధ్యతల విభజన, ఎంత కాలంలో పూర్తి చేస్తారో నిర్ణయించి పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు.
స్థానికులకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆదాయం
స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. స్థానిక కళలు, హస్తకళలు, సాంప్రదాయ ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. హోమ్స్టేలు, స్థానిక గైడ్ సేవలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆదాయం పెంచే అవకాశం కల్పించాలని తెలిపారు.
బ్రాండ్ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు
తెలంగాణ సంస్కృతి, కళలు, హస్తకళలు, చారిత్రక వారసత్వం, స్థానిక ఆహారం, పండుగలు, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా 'బ్రాండ్ తెలంగాణ'కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సీఎస్ స్పష్టం చేశారు. ఈ సమగ్ర విధానం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగం కొత్త ఎత్తులకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications