Huzurabad Bypoll: అభ్యర్థి పేరును ప్రకటించిన టీఆర్ఎస్: గురువు మీద శిష్యుడు బరిలో
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఘట్టంలో మరో అంకం ముగిసింది. ఇన్నాళ్లూ ఉత్కంఠభరితంగా మారిన పార్టీ అభ్యర్థి ఎవరనే విషయానికి టీఆర్ఎస్ అధి నాయకత్వం తెర దించింది. అభ్యర్థి పేరును ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు. ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ ఏర్పడిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి నిర్వహించే ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తారని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వెల్లడించారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులిద్దరూ రాజకీయాల్లో కొనసాగారు. ఆయన తండ్రి మల్లయ్య కొండపాక మాజీ ఎంపీటీసీ. తల్లి పేరు లక్ష్మి హిమ్మత్ నగర్ మాజీ సర్పంచ్. 1983లో జన్మించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎం ఏ, ఎల్ ఎల్ బీ చదవివారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ స్వస్థలం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్. టీఆర్ఎస్ అనుబంధంగా కొనసాగుతోన్న విద్యార్థి విభాగానికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు.

2010 జనవరి 18వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్రను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ విశ్వవిద్యాలయం వరుకు 650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. యువతను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దిశగా మళ్లింపజేయడంలో విజయవంతం అయ్యారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ నాయకత్వంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ క్రియాశీలకంగా పనిచేశారు. ఈటల గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆయనతో పాటు నియోజకవర్గం మొత్తం చుట్టేశారు.
ఇప్పుడు అదే ఈటల రాజేందర్ మీద గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తోన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పాదయాత్ర చేస్తోన్నారు. తాను రాజీనామా చేయడానికి, తనను మంత్రివర్గం నుంచి తప్పించడానికి గల కారణాలను వివరిస్తూ పాదయాత్ర సాగిస్తోన్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రత్యర్థి ఎవరో తేలిపోవడంతో ఈటల రాజేందర్.. ఇక తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఉద్యమ నేపథ్యం ఉండటం, ఈటల రాజేందర్ బలాలు, బలహీనతలు తెలిసి ఉండటం, విద్యార్థి విభాగంలో చురుగ్గా పనిచేసిన అనుభవం ఉన్నందు వల్ల గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అన్నింటికీ మించి హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో వెనుకబడిన వర్గాల ఓటుబ్యాంక్ భారీగా ఉండటం వల్ల వారిని ఆకట్టుకోవడానికి అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని అభ్యర్థిగా బరిలోకి దించిందని అంటున్నారు. ఈటల రాజేందర్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కావడం వల్ల ఆయన ధీటుగా సత్తా చాటుతారని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications