TS గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్: ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను వెల్లడించిన టీఎస్పీఎస్సీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
503 పోస్టులకు ఏప్రిల్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు.
కాగా, గ్రూప్-1కు గతంతో పోలిస్తే ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
రోజుకు సుమారు 10 వేల చొప్పున దరఖాస్తులు అందగా.. మే నెల 31న ఒక్క రోజే దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేశారు. గడువు పెంచిన తర్వాత.. చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో పోటీ పరీక్ష రాసేవారి సంఖ్య భారీగా పెరిగింది.