దేశాన్ని విభజిస్తున్నానా?: కులగణన, రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని గాందీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై ఏర్పాటు చేసిన సదస్సుకు రాహుల్ గాంధీ హాజరై ప్రసంగించారు. కులగణనను ఎక్స్రేతో పోల్చుతానని ఆయన అన్నారు. ఈ కాన్సెప్ట్ సెన్సెస్ ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలిపారు.
కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు ఎక్కువగా ఉంటాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అంటరానితనం భారత్లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కులవివక్ష ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కులగణనలో కొన్ని పొరపాట్లు జరగవచ్చని వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు.

రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేదానిపై సామాన్యులే నిర్ణయించాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో కులవ్యవస్థ ఉందని ఒప్పుకొందామన్నారు రాహుల్ గాంధీ.
తాను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా? అని ప్రశ్నించారు. ఈ కులగణన ద్వారా ఓబీసీలు, దళితులు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. ఈ కులగణన తర్వాత ఎవరి వద్ద ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందామన్నారు. జనాభా తగ్గట్లు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కులగణన చేస్తామని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పానని, ఇప్పుడు అమలు చేస్తున్నామని రాహుల్ చెప్పారు.
అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా బోయిన్పల్లికి చేరుకున్నారు. రాహుల్ రాకతో ఆ మార్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications