‘9’ అంకె రాష్ట్రానికి శుభసూచకం: అందుకే 27, చక్రం తిప్పిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే ఇప్పుడు మొత్తంగా 27 జిల్లాలు ఉండేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందా? అంటే అవుననే అంటున్నారు.
సంఖ్యాశాస్త్రపరంగా తెలంగాణలో 27 జిల్లాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కొత్తగా జిల్లాల ప్రస్తావన రాగానే, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
నిజానికి కొత్తగా 14 లేదా 15 జిల్లాలను ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. సంఖ్యాశాస్త్రపరంగా పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల సంఖ్య 24 లేదా 27 ఉంటాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 24 జిల్లాలుంటే 2+4='6', లేదా 27 జిల్లాలుంటే 2+7='9' అంకె రాష్ట్రానికి శుభసూచకమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
అధికారంలోకి వస్తే కొత్తగా 14 జిల్లాలు ఏర్పాటు చేస్తామని గడచిన ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటే మొత్తం 24 జిల్లాలు ఏర్పాటు అవుతాయి. కానీ, రాష్ట్రంలో ఈ మధ్య పలు కొత్త జిల్లాల డిమాండ్లు పెరగడంతో మరో 3 జిల్లాలను పెంచవచ్చని చెబుతున్నారు.
అంటే కొత్తగా 17 జిల్లాలు ఏర్పాటు చేయవచ్చని తెలిసింది. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్దే తుది నిర్ణయమని అంటున్నారు. తాజాగా కొత్త జిల్లాల జాబితాలో సిరిసిల్లనూ చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలను మాత్రమే జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.
అయితే తాజాగా జగిత్యాలతో పాటు కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లనూ జిల్లాగా మార్చేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు సిరిసిల్ల ప్రసిద్ధి చెందింది. రాజకీయ కోణంలోనే కాకుండా సిరిసల్లను జిల్లా కేంద్రంగా చేస్తే టెక్స్టైల్ హబ్గా తీర్చిదిద్దవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.