తెలంగాణలో దారుణం: అంబులెన్స్ సౌకర్యం లేక: గర్భిణీని డోలీపై తీసుకెళ్తుండగా:
కొత్తగూడెం: తెలంగాణలో నూతన అధ్యాయాన్ని లిఖించడానికి, నూతన విధానాల్లో పాలనను అందించడానికి.. కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకుంటోంది కేసీఆర్ ప్రభుత్వం. పాత సచివాలయాన్ని కూల్చేస్తోంది. కోట్ల రూపాయలను దాని కోసం ఖర్చు చేస్తోంది. దీనిపై పెట్టే ఖర్చు గానీ, చూపించే శ్రద్ధ గానీ.. కనీస వసతులను కల్పించడంపై పెట్టలేకపోతోందనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని చర్ల మండలం ఏజెన్సీ గ్రామాల్లో నివసించే ఓ గిరిజన మహిళ అడవి మధ్యలో బిడ్డకు జన్మనివ్వాల్సిన దుస్థితిని చవి చూశారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి డోలీని వినియోగించాల్సి వచ్చింది. గ్రామం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్ల మండలంలోని ఆసుపత్రికి డోలీలో తీసుకెళ్లే సమయంలో.. ఆమె మార్గమధ్యలో, అడవుల మధ్య ప్రసవించారు. బిడ్డకు జన్మనిచ్చారు.
ప్రసవించే సమయంలో ఆమె వద్ద ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. వారే ఆమెకు పురుడు పోశారు. అనంతరం బిడ్డతో సహా డోలీలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లీ, బిడ్ద క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె భర్త ఆశా వర్కర్. పురుడు అనంతరం తనకు తెలిసిన వైద్యాన్ని ఆయన అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేసీఆర్ ప్రభుత్వంపై నెటిజన్లు విమర్శలను గుప్పిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.
తెలంగాణను సాధించిన ఆరేళ్ల తరువాత కూడా క్షేత్రస్థాయిలో కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించలేకపోతోందని మండిపడుతున్నారు. స్వపరిపాలనలోనూ అదే నిర్లక్ష్యంగా కొనసాగుతోందంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక వైద్య సౌకర్యాలు, రవాణా వసతి అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఓ తల్లి అడవుల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన దుస్థితి ఏర్పడటానికి ప్రభుత్వమే కారణమంటూ విమర్శిస్తున్నారు. ఆమెకు ఏదైనా జరగరానిది జరిగి ఉంటే.. దానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
వాస్తు బాగా లేదని, పరిపాలనను కొనసాగించడానికి అనువుగా లేదని, కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి పాత సచివాలయాన్ని కూల్చేయడం, దాని స్థానంలో కొత్త భవన సముదాయాలను నిర్మించబోతోండటం సరికాదని, దానిపై పెట్టే ఖర్చును ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం కేటాయించలేకపోతోందంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. బంగారు తెలంగాణ సాధిస్తామంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్.. అంబులెన్స్ను సమకూర్చలేకపోతున్నారని భగ్గుమంటున్నారు.