7500 నుంచి లక్షకు పెరిగిన జడ్పీ ఛైర్పర్సన్ వేతనం: ఏప్రిల్ 1 నుంచి అమలు
హైదరాబాద్: స్ధానిక ప్రజాప్రతినిధులకు ఇచ్చే వేతనాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, జిలా పరిషత్ ఛైర్ పర్సన్ గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
దీనికి సంబంధించిన అమలు ఉత్తర్వులను పంచాయితీ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ ప్రస్తుతం జారీ చేశారు. పెంచిన వేతనం ప్రకారం స్ధానిక ప్రజాప్రతినిధులకు రూ. 102.5 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది. గతంలో ఇది రూ. 10 కోట్లుగా ఉండేది.
గతంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లకు, సర్పంచ్లకు గౌరవ వేతనంలో ప్రభుత్వం సగం ఇవ్వగా, మిగిలిన సగం జిల్లా పరిషత్/గ్రామ పంచాయితీ నుంచి తీసుకునే వారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు గతంలో కూడా వందశాతం గౌరవ వేతనాన్ని ప్రభుత్వమే ఇచ్చేది.
గతంలో సర్పంచ్లకు ప్రభుత్వం రూ. 1000 నుంచి 1500 వరకు ఇవ్వగా పెరిగి వేతనం ప్రకారం రూ.5000 అయింది. అదే ఎంపీటీసీ సభ్యుడికి గతంలో రూ. 750 ఇవ్వాగా ఇప్పడు రూ. 5000 అయింది. మండల పరిషత్ అధ్యక్షుడికి గతంలో రూ.1500 ఇవ్వగా ఇప్పుడు 10,000 అయింది.
ఇక జడ్పీటీసీ సభ్యుడికి రూ. 2250 ఇవ్వగా ఇప్పుడు రూ. 10,000 అయింది. ఇక జడ్పీ ఛైర్ పర్సన్కు రూ. 7500 నుంచి ఏకంగా రూ. 1,00,000గా పెరిగింది.