బాలికపై లైంగిక దాడి: నిర్భయ చట్టం కింద జైలు
హైదరాబాద్: మైనర్ బాలిక అపహరణ, లైంగికదాడి కేసులో ముద్దాయికి నిర్భయ చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష విధించారు. రాష్ట్ర రాజధానిలో మొదటిసారి నిర్భయ చట్టం కింద శిక్ష విధించడం ఇదే మొదటిసారి. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ కథనం ప్రకారం తలాబ్కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్ (21) మరో ముగ్గురు కలిసి 2013, డిసెంబర్ 14న మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు.
పలు ప్రాంతాలు తిరుగుతూ నాలుగురోజులపాటు మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక తల్లి భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్భయ చట్టం సెక్షన్ 6 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం 2012, రెండ్ విత్ 34 ఐపీసీ కింద మొదటిసారిగా భవానీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన మహ్మద్ సల్మాన్ను జైలుకు పంపిన పోలీసులు, మిగతా ముగ్గురు మైనర్లు కావడంతో జువైనల్ హోంకు పంపించారు. ఈ ముగ్గురిపై విచారణ కూడా జువైనల్ బోర్డులో నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు, పూర్తి ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పుర్వాపరాలు పరిశీలించిన ఎఎంఎస్జే న్యాయస్థానం బుధవారం ప్రధాన నిందితుడు మహ్మద్ సల్మాన్కు పదేండ్ల శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారని డీసీపీ తెలిపారు.