హైదరాబాద్ లో అద్దిరిపోయే ఐకానిక్ బ్రిడ్జి- టెండర్లకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ లో మరో భారీ బ్రిడ్జి నిర్మితం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. దీని నిర్మాణానికి అవసరమైన నిధులను ఇదివరకే మంజూరు చేసింది. ఇప్పుడు దీనికి తాజాగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. టెండర్లను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు ఉత్తర్వులు విడుదల చేశారు.
రోడ్ కనెక్టివిటీని మరింత మెరుగుపర్చడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి ఈ బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రాత్మక మీరాలం ట్యాంక్ పై ఈ వంతెన రూపుదిద్దుకోనుంది. ఐకనిక్ బ్రిడ్జిగా నిర్మితం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని నిర్మాణానికి 430 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.

ఈ వంతెన నిర్మాణంతో శాస్త్రీపురం నుంచి చింతల్మెట్ మీదుగా బెంగళూరు జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. జాతీయ రహదారి 44- చింతల్మెట్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) సమకూర్చుతుంది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) విధానంలో టెండర్లను ప్రారంభించాలని ఎమ్మార్డీసీల్ ను ప్రభుత్వం ఆదేశించింది.
భూ సేకరణ ప్రక్రియతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, ఇతర నిర్మాణ పనులు కూడా సమాంతరంగా కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ కోసం ఓపెన్ టెండర్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ను నియమించాలని MRDCLకు సూచించింది. ఈ వంతెన డిజైన్, నిర్మాణ నమూనాలను ఈపీసీ కాంట్రాక్టర్ సమర్పించిన తరువాత.. వాటిని మొదట పీఎంసీ ఏజెన్సీ ఆమోదించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ వరంగల్ లేదా జేఎన్టీయూ హైదరాబాద్ వంటి పేరున్న సంస్థలు సమీక్షించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మార్డీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications