టీఆర్ఎస్కు రెడ్డి సెగ: పోరుయాత్రలో హైటెన్షన్, అది క్లియర్..
హైదరాబాద్: కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలన్న పాకులాట ఒకరిది.. అధికారం తమ చేతుల్లోనే ఉండిపోవాలన్న అభిలాష మరొకరిది. ఇద్దరి పోరు రాజకీయ ఆధిపత్యం కోసమే. ఒకరేమో ఐక్యం కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొకరు మరో సామాజిక వర్గాన్ని కలుపుకుంటే తమ బలం పెరుగుతుందని భావిస్తున్నారు.
తెలంగాణ ముఖచిత్రం మీద రెడ్డి సామాజిక వర్గానికి వెలమ సామాజిక వర్గానికి మధ్య జరుగుతున్న అంతర్గత పోరు తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మొన్నటి వీ6 డిబేట్లో తమను కించపరచడం.. నిన్నటి రెడ్డి పోరు యాత్రను ప్రభుత్వం అణచివేయాలని చూడటం ఆ సామాజిక వర్గానికి మింగుడుపడటం లేదు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ మీద విషం కక్కిందన్న భావనలో ఉన్న రెడ్లు తిరిగి సంఘటితమై.. మరోసారి రాజ్యాధికారం దిశగా నడవాలనే చర్చలు చేస్తున్నారు.
రెడ్ల ఐక్యతను పసిగట్టిన సీఎం కూడా వారికంటే వేగంగానే పావులు కదుపుతున్నారు. రెడ్డి వర్గానికి చెక్ పెట్టాలంటే.. ప్రత్యామ్నాయంగా కమ్మ సామాజిక వర్గాన్ని తమతో కలుపుకుపోవాలనే భావనలో ఆయన ఉన్నారు. వెలమ, కమ్మ సామాజిక వర్గాల కలయిక ద్వారా తెలంగాణ రెడ్డి ప్రాబల్యానికి చెక్ పెట్టవచ్చునని యోచిస్తున్నారు.
ప్రభుత్వంపై పోరు:
రెడ్డి సామాజిక వర్గం కూడా ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్దమైంది. తెలంగాణలో వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని, నిరుపేద రెడ్డి కులస్తులకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలన్న డిమాండ్లతో తాజాగా రెడ్డి పోరు యాత్ర చేపట్టింది. రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 2న వేములవాడ నుంచి ప్రారంభమైన పోరు యాత్ర వివిధ జిల్లాల మీదుగా బుధవారం రాత్రి మేడ్చల్కు చేరుకుంది.
అరెస్టుల పర్వం:
గురువారం కొంపల్లి వద్ద ముగింపు కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వేలాదిగా రెడ్డి కులస్తులు తరలివచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఈ సభకు వచ్చేవారిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు.
మేడ్చల్ నగర పంచాయతీ అత్వెల్లి శివాలయం వద్ద గుమిగూడిన వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. దాదాపు 700 మందికిపైగా అరెస్టులు జరిగాయి. ఒకవైపు, పోలీసులు అరెస్టులు చేస్తుండగానే.. మరోవైపు వేలాదిగా రెడ్డి కులస్తులు వాహనాల్లో తరలి వస్తూనే ఉన్నారు. దీంతో భారీ ఎత్తున పోలీసులను మోహరించి అరెస్టుల పర్వానికి తెరదీశారు.
తీవ్ర ఉద్రిక్తతలు:
పోలీసుల అణచివేతతో ఆగ్రహం చెందిన చాలామంది రెడ్డి కులస్తులు మధ్యాహ్నం 2 గం. ప్రాంతంలో వేలాదిగా జాతీయ రహదారిపైకి తరలి వచ్చి, అక్కడి నుంచి మేడ్చల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి.. అరెస్ట్ చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో బోయిన్పల్లి నుంచి తూప్రాన్ వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిస్థితి చేయి దాటుతుండటంతో సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య రంగంలోకి దిగి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో పలువురి తలలు పగిలాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
బలవంతంగా మూసేయించారు?:
ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానికంగా ఉన్న షాపులను పోలీసులు మూసివేయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ క్లినిక్ ను కూడా బలవంతంగా మూసివేయించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక పాపకు చికిత్స అందిస్తుండటంతో డాక్టర్ అభ్యంతరం చెప్పారు. దీంతో ఆ క్లినిక్ నిర్వాహకుడిని ఎస్ఐ మెడ పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు.
శేఖర్ కమ్ముల ఫిదా సినిమా, కెసిఆర్ వెల్కం: లింకేమిటి?
ఆ విషయం క్లియర్?:
శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తున్న తమపై పోలీసులు అన్యాయంగా లాఠీఛార్జ్ చేసి గాయపరిచారని, రెడ్డి కులస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాదయాత్రకు ఎటువంటి అనుమతి తీసులేదని డీసీపీ సాయిశేఖర్ తెలిపడం గమనార్హం.
మొత్తానికి బుధవారం నాటి సీన్తో రెడ్డి సామాజిక వర్గంప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిలో వ్యవహరిస్తోందని అర్థమవుతోంది. తమ పట్ల వ్యతిరేకత కలిగేలా కొంతమందిని ఉసిగొల్పడమే కాక, ఎక్కడ ఐక్యమవుతామోనన్న భావనతో తమ పాదయాత్రలను అడ్డుకుంటున్నారన్న భావనలో ఆ సామాజికవర్గం ఉంది. ఈ అసహనం ఆ సామాజిక వర్గాన్ని టీఆర్ఎస్ నుంచి దూరం చేస్తుందా? అన్నది భవిష్యత్తులో తేలనుంది.
డామిట్ కథ అడ్డం తిరిగింది: కేసీఆర్కు ఊహించని దెబ్బ, టారెత్తిపోయిన దేశపతి?