వైఎస్ షర్మిల పాదయాత్రలో టెన్షన్; దాడులు కాదు దమ్ముంటే ఆ పని చెయ్యండన్న షర్మిల!!
వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిల వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అనుచరులు ఫ్లెక్సీలు చించివేయటంపై మండిపడ్డారు. దాడులకు పాల్పడే వారిని అరెస్ట్ చెయ్యాలన్నారు.
వైయస్ షర్మిల పాదయాత్రలో మళ్లీ రగడ కొనసాగుతుంది. వైయస్ షర్మిల పాదయాత్రను అడ్డుకోవడానికి బిఆర్ఎస్ నాయకులు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆగిపోయిన చోటు నుంచే పాదయాత్రను మొదలుపెట్టిన షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అనుచరుల నుండి నిరసన సెగ తగిలింది.
మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
వైయస్ షర్మిల పాదయాత్రకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు చించి వేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. నేడు పర్వతగిరి మండలంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై వైయస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎందుకు పని చేస్తున్నారో అర్థం కావడం లేదని వైయస్ షర్మిల విమర్శించారు.
హిండెన్ బర్గ్ మీద చర్చ జరిగినట్టే కేసీఆర్ పై చర్చ జరగాలి
ఇక ఇదే సమయంలో తెలంగాణా సీఎం కేసీఆర్ పైన కూడా షర్మిల మండిపడ్డారు. రుణమాఫీ నుంచి దళితబంధు వరకు కేసీఆర్ వన్నీ మోసాలే అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. తెలంగాణ సొమ్మును లూటీ చేసి, దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడిగా ఎదిగాడని ఆరోపించారు. హిండెన్ బర్గ్ మీద ఎలాగైతే చర్చ జరుగుతుందో.. కేసీఆర్ అవినీతి మీద కూడా చర్చ జరగాలని షర్మిల పేర్కొన్నారు.
షర్మిల ఫ్లెక్సీలు చించివేసిన బీఆర్ఎస్ నాయకులు.. షర్మిల ఫైర్
ఇక ఇదే సమయంలో ఆరూరి రమేష్ నియోజకవర్గంలో చేస్తున్న అక్రమాలను ఉద్దేశించి వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. దీంతో షర్మిల ఫ్లెక్సీలను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వర్గీయులు చించి వేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక ఈ అంశం పైన నేడు పర్వతగిరి మండలం తురకల సోమారం వద్ద మాట్లాడిన వైఎస్ షర్మిల దాడులకు భయపడేది లేదని, తమపై ఎంత దాడి చేస్తే అంత బలంగా అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలను గురించి మాట్లాడతామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను నిరంకుశంగా అణచివేయాలనే వైఖరి మంచిది కాదన్నారు.
దమ్ముంటే ఆ పని చెయ్యండి .. దాడులు కాదు: షర్మిల
బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ ఫ్లెక్సీలను చించి వేయడం హేయమైన చర్య అని వైయస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తాను చేసిన ఆరోపణల పైన ప్రజాక్షేత్రంలో పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేయాలని, అందరి ముందు చర్చించి తమ నిజాయితీని నిరూపించుకోవాలంటూ వైయస్ షర్మిల సవాల్ విసిరారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అడిగిన ప్రశ్నలపై దమ్ముంటే సమాధానం చెప్పాలని ఇలా దాడులకు పాల్పడడం మంచిది కాదని, దాడులకు పాల్పడితే భయపడే వారు ఎవరూ లేరని వైయస్ షర్మిల పేర్కొన్నారు. అధికారం ఉందని, డబ్బు ఉందని దాడులు చేస్తే సహించబోమని, దాడులకు పాల్పడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.