రేవంత్ ప్రపోజల్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..: ఎవరికీ ఇవ్వని అవకాశం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరో ఏడు నెలల పాటు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది.
1991 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి కే రామకృష్ణారావు. రాష్ట్ర విభజన అనంతరం ఆయనను తెలంగాణకు కేటాయించింది డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. సీనియారిటీ ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.

ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలంటూ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి కిందటి నెల 30వ తేదీన స్వయంగా లేఖ రాశారు. ఆయనకు ఉన్న అపారమైన పరిపాలనా అనుభవం, విధానపరమైన నిర్ణయాలు, పాలనాంశాలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం ఉన్నందున పదవీకాలాన్ని పొడిగించాలని కోరారు.
దీనికి కేంద్రం అంగీకరించింది. ఆయన పదవీ కాలాన్ని ఏడు నెలల పాటు పొడిగించింది. దీని ప్రకారం చూస్తే- మార్చి 30వ తేదీ వరకు రామకృష్ణారావు ఐఎఎస్ గా కొనసాగుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలోనే సేవలు అందించడం ఖరారైనట్టే.
సాధారణంగా పదవీకాల పొడిగింపులు మూడు లేదా ఆరు నెలల పాటు ఉంటాయి. ఈసారి ఏడు నెలల పొడిగింపును ఒకేసారి మంజూరు చేయడం గమనార్హం. తెలంగాణ ఏర్పడిన ఈ 10 సంవత్సరాల కాలంలో 2014లో తొలి సీఎస్గా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ శర్మ మినహా ఏ ఇతర ప్రధాన కార్యదర్శికీ పదవీకాల పొడిగింపు లభించలేదు.
రాజీవ్ శర్మకు ఆరు నెలల పొడిగింపు లభించింది గానీ.. ఒకేదఫా ఆదేశాలు ఇవ్వలేదు కేంద్రం. మూడు నెలలు చొప్పున రెండు దశల్లో ఉత్తర్వులు వెలువడించింది అప్పట్లో. దీనికి భిన్నంగా రామకృష్ణారావు విషయంలో ఏడు నెలల పొడిగింపును ఒకేసారి మంజూరు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వంతో పెరుగుతున్న సత్సంబంధాలకు నిదర్శనంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రామకృష్ణారావు పదవీకాల పొడిగింపు వెనుక రేవంత్ రెడ్డికున్న బలమైన ప్రభావమే కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications