కాంగ్రెస్ లో చేరికలు, నాయకత్వానికి పరీక్ష - సమన్వయం సాధ్యమేనా..!!
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. చేరికలు పెరుగుతున్నాయి. పలువురు సీనియర్లు ఎన్నికల వేళ గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారు. మరి కొందరు ఎన్నికల వేళ ఎంట్రీ ఇచ్చేలా ముందస్తు మంతనాలు సాగిస్తున్నారు. కొత్తగా చేరుతున్న వారికి సీట్ల పైన హామీలు దక్కుతున్నాయి. ఇది పార్టీనే నమ్ముకొని ఇంత కాలం అంకితభావంతో ఉన్న నేతల్లో పలు సందేహాలకు కారణమవుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ నాయకత్వానికి పరీక్షగా మారుతున్నాయి.
పెరుగుతున్న చేరికలు
కాంగ్రెస్ చేరికల ప్రవాహం పెరిగింది. అధికారం ఖాయమంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం ఇతర పార్టీలో కొందరు ముఖ్యులపైన ప్రభావం చూపుతోంది. కాంగ్రెస్ లో చేరేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్య నేతలు తమతో పాటుగా తమ మద్దతుదారులకు సీట్ల పైన హామీలు పొందుతున్నారు. ఇది పార్టీనే నమ్ముకొని ఇంత కాలం అంకితభావంతో ఉన్న నేతల్లో పలు సందేహాలకు కారణమవుతోంది.

ఇంత కాలం తమను ఇబ్బంది పెట్టిన నేతలు ఇప్పుడు తమ పార్టీలోకి రావటం పైన పలు చోట్ల సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీరిని పార్టీ ఎలా సమన్వయం చేస్తుంది. సీట్ల విషయంలో అనుసరించే ఫార్ములా ఏంటి. ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది. ఇవ్వలేని వారికి ఎలా న్యాయం చేస్తుంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రధాన చర్చగా మారుతోంది.
టీకెట్లపై హామీలతో సమస్యలు
పార్టీలో చేరికలను ప్రోత్సహించి..ప్రత్యర్ధి పార్టీలను దెబ్బ తీయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం వచ్చే వారికి హామీలు గుప్పిస్తోంది. కొత్త వారు చేరికలు అవసరమే అయినా..పాత వారికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో పని చేసిన వారు తమ నియోజకవర్గాల్లో సీట్లపైన ఆశలు పెట్టుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో కొత్త నేతలను చేర్చుకొనే క్రమంలో సీట్ల హామీలు ఇస్తుండటం వారికి రుచించటం లేదు.
ఉమ్మడి మహబూబ్నగర్లో కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో చేరికలపైన నాగం జనార్ధనరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దామోదర్ రెడ్డి తన కుమారుడికి సీటు పైన హామీ కోరారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు సిద్దమయ్యారని తెలుస్తోంది. తన వర్గానికి సీట్లపైన హామీ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం జిల్లాలోని పార్టీ నేతలకు అంతుచిక్కటం లేదు.
సమన్వయం సాధ్యపడేనా
ఖమ్మం జిల్లాలో పాత, కొత్త నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొని ఉంది. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం తిరిగి పార్టీలో చేరటం..సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో సీతక్క కుమారుడు అక్కడ చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు ఖాయమయ్యాయి. ఈ సమయంలో వారికి ఇస్తున్న హామీలతో పార్టీనే నమ్ముకున్న నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.
కొత్త నేతలను చేర్చుకోవటం పైన అభ్యంతరం లేదంటున్న నేతలు, సీట్ల విషయంలో మాత్రం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్న వారి కంటే పార్టీని అంటిపెట్టుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాత వారికి ఎక్కడా నష్టం లేకుండా, అదే సమయంలో కొత్త వారిని ఆకట్టుకొనేలా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు టీ కాంగ్రెస్ ముఖ్య నేతల పైన ఉంది. ఇది నేతల సమర్దతకు పరీక్షగా మారుతోంది.












Click it and Unblock the Notifications