మెట్రో సేవలిలా: 29 నుంచి అసలు సర్వీసులు మొదలు.. ఆర్నెల్ల వరకు 15 నిమిషాలకో సర్వీస్
మంగళవారం హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. అయితే బుధవారం నుంచి లాంఛనంగా సర్వీసులు మొదలవుతాయి. ఆరు నెలల పాటు 15 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులో ఉంటుంది.
Recommended Video
హైదరాబాద్: వచ్చే మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్న హైదరాబాద్ మెట్రో.. లాంఛనంగా ప్రజలకు సేవలందించనున్నది బుధవారం నుంచే సుమా. అదీ కూడా 29వ తేదీన ప్రతి 15 నిమిషాలకో రైలు సర్వీసు చొప్పున నడుస్తుంది. సాంకేతికంగా భద్రతా పరీక్షలు నిర్వహించిన తర్వాత మూడు నిమిషాలకో సర్వీస్ భాగ్య నగరి వాసులకు అందుబాటులోకి వస్తుంది. ఇది ఆరు నెలలపాటు పరిమితంగానే తిరగబోతోంది. కొత్తగా నిర్మించిన లైన్లో అధికంగా మెట్రో సర్వీసులు తిప్పితే సాంకేతిక ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో మెట్రో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలపాటు ఈ లైను స్థిరత్వాన్ని నిపుణులు పరిశీలించే వరకు ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు తిరగనున్నది.
ఆరు నెలల తర్వాత ఈ కారిడార్లో ప్రయాణికుల రద్దీని బట్టి మూడు నిమిషాలకు ఓ రైలు తిప్పాలా ఐదు నిమిషాలకు తిప్పాలా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మెట్రో అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం మెట్రో 57 రైళ్లను తెప్పించింది. ఇందులో రెండు రైళ్లను తాత్కాలిక ప్రాతిపదికన నాగ్పూర్ మెట్రోకు ఇచ్చింది. మియాపూర్- నాగోలు కారిడార్లో ప్రారంభంలో మూడు కోచ్లతో 17 రైళ్లను నడపాలని నిర్ణయించారు. అవసరమైన మేరకు రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు.
2010లో ఇలా టిక్కెట్ల ధరలు ఖరారు
మెట్రో ప్రారంభోత్సవానికి ఇంకా నాలుగు రోజులే గడువు ఉన్నా ఇప్పటివరకూ టిక్కెట్ ధరలు మాత్రం ఖరారు కాలేదు. ఎప్పుడు ప్రకటిస్తారో అధికారులే చెప్పడం లేదు. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని అడిగితే ‘అన్నీ సిద్ధమవుతున్నాయి.. టిక్కెట్ రేటు ఎంతన్నది ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటి వరకు ఓపిక పట్టాలన్నారు. ఇప్పటికే ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రో అధికారుల మధ్య దీనిపై రెండుసార్లు చర్చలు జరిగాయి. రెండు సంస్థలు టిక్కెట్ రేట్లపై ప్రభుత్వానికి నివేదిక పంపాయి. కనిష్ఠంగా రూ.8, గరిష్ఠంగా రూ.19 వసూలు చేయాలని ప్రభుత్వం, ఎల్అండ్టీ మధ్య 2010లో ఒప్పందం జరిగింది.
నమ్మ మెట్రోలో గరిష్ఠంగా రూ.45
వివిధ కారణాలతో ప్రాజెక్టు ఆలస్యం కావడంతో తమపై రూ.వేల కోట్ల అదనపు భారం పడిందని, అందువల్ల టికెట్ రేట్లు పెంచాలని ఎల్అండ్టీ మెట్రో కోరుతోంది. అధికంగా రేట్లను నిర్ణయిస్తే చెడ్డపేరు వస్తుందని, మధ్యే మార్గంగా పెంపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బెంగళూరు నమ్మ మెట్రోలో కనిష్టంగా రూ.10 గరిష్ఠంగా రూ.45 వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడ కనిష్టంగా రూ.12, గరిష్ఠంగా రూ.45- 50 మధ్య ధర నిర్ణయించాలని భావిస్తున్నారని తెలిసింది. టికెట్ రేట్లు శుక్ర, శనివారాల్లో ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
200 కి.మీ.లకు విస్తరించనున్న హైదరాబాద్ మెట్రో
ఇప్పటివరకు ప్రజా రవాణలో వెనుకబడి ఉన్న భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో రాక పెద్ద ఊరటే. మొత్తం అన్ని మార్గాల్లో అందుబాటులోకి వస్తే 15 లక్షల మందికి పైగా రాకపోకలు సాగించే వీలు ఉంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు మెట్రో ప్రాజెక్టును విస్తరించాల్సిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుబాటులోకి రానున్న మెట్రో కారిడార్లతో కొంత ఉపశమనం లభించనుంది. ఈ 72 కిలోమీటర్లు సరిపోదు.. ఇప్పటికే 200 కిలోమీటర్ల మెట్రో ఉండాలి.. వచ్చే 25 ఏళ్లలో 400 కిలోమీటర్ల దూరం విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
మెట్రోలో లగేజీ అంతకు మించితే రుసుం వసూలు
మెట్రో రైలులో ప్రయాణం సౌకర్యమే అయినా.. భారీ లగేజీని వెంట తీసుకెళ్తామంటే కుదరదు. మన మెట్రోలో 10 కిలోల వరకే ఒక ప్రయాణికుడు ఉచితంగా బ్యాగేజీని తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. పది కిలోల పైన ప్రతికిలోకి రూ.1 ఛార్జీ చేస్తారని సమాచారం. 40 కిలోల బరువుకు మించి రవాణాకు అనుమతి లేదు. ప్రపంచ వ్యాప్తంగా మెట్రోలో లగేజీపై ఆంక్షలు ఉన్నాయి. దుబాయ్ మెట్రోలో మాత్రం ఎలాంటి పరిమితులు లేవు. మొన్నటి దాక ఉన్న వాటిని ఎత్తేశారు. మన దేశంలో దాదాపు అన్ని మెట్రోల్లో 15 కిలోల వరకు అనుమతిస్తున్నారు. ఇక్కడ 10 కిలోలకు పరిమితం చేశారు. తోటి ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూడాలనే ఈ పరిమితి విధించినట్లు అధికారులు అంటున్నారు. 5 కిలోల వరకే అనుమతించాలని మొదట్లో భావించినా చివరికి 10 కిలోలుగా నిర్ణయం తీసుకున్నారు.
వారాంతపు పాస్ ఫెసిలిటీ ప్లస్ బృందంగా వెళితే గ్రూప్ పాస్ కూడా
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెట్రోలో టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకవైపు టికెట్ తీసుకోవచ్చు. ప్రతిసారి వరుసల్లో నిలబడటం ఎందుకనుకొంటే ఒకేసారి రానూపోను తీసుకొనే వెసులుబాటు ఉంది. ట్రిప్ టికెట్టూ అందుబాటులో ఉంటుంది. నిర్ణీత సమయం, రోజుల నడుమ ఎన్ని ట్రిప్పులు వేస్తారనే దానిపై ఛార్జీ ఉంటుంది. వారం, మూడు, ఆరునెలలు చెల్లుబాటయ్యేలా కార్డుతోనూ ప్రయాణించవచ్చు. మనం ఇప్పటివరకు డే, మంత్లీ పాసులను చూశాం. మెట్రోలో తొలిసారిగా వారాంతపు పాసులను చూడబోతున్నాం. శని, ఆదివారాలు మాత్రమే వినియోగించుకొనేలా వీటిని జారీ చేస్తారు. నెలంతా ఇష్టమైనన్నిసార్లు నిర్ణీత మార్గంలో ప్రయాణించే వారికి నెలవారీ పాసులు ఉన్నాయి. ఇక పది మంది కంటే ఎక్కువ ఒకే బృందంగా స్టేషన్ నుంచి బయలుదేరుతుంటే గ్రూపు టికెట్ తీసుకునే వీలు కల్పించనున్నట్లు సమాచారం. 20 మంది బృందానికి ఒక గ్రూప్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. అంతకుమించి ఉంటే మరో గ్రూప్ టికెట్ తీసుకోవాలి.
జరిమానా పడుతుంది ఇందుకు..
ప్రయాణికులు మెట్రో పెయిడ్ ఏరియాలో ప్రవేశించి ఒక స్టేషన్ నుంచి గమ్యస్థానానికి 120 నిమిషాల్లో చేరిపోవాలి. అంతకుమించి.. రైలు ఎక్కకుండా ఫ్లాట్ఫాంపై వేచి చూస్తూ.. దిగే సమయానికి రెండు గంటలు దాటిందంటే అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. ప్రతి అదనపు గంటకు రూ.20 చెల్లించాలి. అన్పెయిడ్ ఏరియాలో దుకాణాలు ఉంటాయి. ఇక్కడ ఎంతసేపైనా గడపవచ్చు. ఎలాంటి ఆంక్షలు లేవు. షాపింగ్ చేయవచ్చు. సరైన టికెట్, పాస్ లేకుండా మెట్రోలో ప్రయాణిస్తే ఇట్టే దొరికిపోతారు. ప్రయాణదూరాన్ని బట్టి జరిమానా ఉంటుంది. మీరు ప్రయాణిస్తున్న మార్గం మొత్తం ఛార్జీతో పాటూ రూ.50 అదనంగా వసూలు చేస్తారు.