లోకేష్ పై తెలంగాణ మంత్రులు ఫైర్..!!
ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణ నేతలకు టార్గెట్ అయ్యారు. కొంత కాలంగా బనకచర్ల అంశం పైన రెండు రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం పైన తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. బీఆర్ఎస్ నేతలు లోకేష్ చేసిన కామెంట్స్ పైన సీరియస్ గా స్పందించారు. ఇప్పుడు ,తెలంగాణ మంత్రులు సైతం లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.
ఏపీ మంత్రి లోకేష్ మాటలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. బనకచర్లను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చిన తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి ఏపీ ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. బనకచర్లప్రాజెక్టు పై ఏపీ మంత్రుల ప్రకటనలు తాము పట్టించుకోమని తేల్చి చెప్పారు. అదే విధంగా మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఘాటు వ్యాఖ్యలు చేసారు. లోకేష్ నికర, మిగులు, వరద జలాలు గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బనకచర్లపై ఏపీ పట్టుబడితే పోలవరంపై కౌంటర్ ఇస్తామన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో చుక్క కూడా వదులుకోం అని స్పష్టం చేశారు.

అసమానతలు రెచ్చగొడుతున్నారన్న లోకేష్ వ్యాఖ్యలు సరికావని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నికర జలాలు,మిగులు జలాలు ,వరద జలాలు గురించి ముందు తెలుసు కోవాలంటూ హితవు పలికారు. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి లభ్యత దృష్ట్యా 968 టిఎంసి లు తెలంగాణ కు ,531 టీఎంసీ లు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన తరువాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలన్నారు.

వరద జలాల లభ్యత పైన ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తి అయిన తరువాత వరద జలాలు లెక్కలోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆది తెలవకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ఉందన్నారు. తమ నీటిని ఒక చుక్క కూడా వదులుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.












Click it and Unblock the Notifications