ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ: హైదరాబాద్ నడిరోడ్డుపై చెల్లాచెదురుగా ప్రజా పాలన దరఖాస్తులు
Praja Palana applications: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన కార్యక్రమం గాడి తప్పింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు దాఖలు చేసుకున్న పలు దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి. చెల్లాచెదురయ్యాయి.
ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో ప్రజా పాలన కార్యక్రమానికి తెర తీశారు రేవంత్ రెడ్డి. కిందటి నెల 28వ తేదీన ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీతో ముగిసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. మొత్తంగా 1,25,84,383 దరఖాస్తులు దాఖలు అయ్యాయి.

ఇందులో అత్యధికం- ప్రభుత్వ పథకాల కోసం ఉద్దేశించినవే. పక్కా ఇళ్లు, చేయూత, తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయాలంటూ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండో స్థానంలో పక్కా ఇళ్ల దరఖాస్తులు నిలిచాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులను పెట్టుకున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ హైదరాబాద్ నడిరోడ్డుపై చెల్లాచెదురుగా ప్రజా పాలన దరఖాస్తులు..!! pic.twitter.com/20jBXJqhL7
— oneindiatelugu (@oneindiatelugu) January 9, 2024
వాటన్నింటినీ కంప్యూటరీకరించే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది ప్రభుత్వం. ఒక్కో దరఖాస్తును కంప్యూటరీకరించడానికి అయిదు రూపాయల మొత్తాన్ని చెల్లిస్తోంది. ఈ నెల 17వ తేదీ నాటికి వాటన్నింటినీ కంప్యూటీకరించాల్సి ఉంటుందని డెడ్ లైన్ విధించింది. దరఖాస్తులను తరలించడానికి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికార యంత్రాంగం.

పేదలు ఎన్నో ఆశలు పెట్టుకుని, వ్యయ ప్రయాసలకు ఓర్చి దాఖలు చేసుకున్న దారఖాస్తులను తరలించడానికి ప్రత్యేకంగా ఎలాంటి రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. వాటిని తరలించడానికి ర్యాపిడో బైక్స్ సేవలను వినియోగించుకుంటోంది ప్రభుత్వం.
హయత్ నగర్ సర్కిల్లో దాఖలైన అప్లికేషన్లను కంప్యూటరీకరించడానికి ర్యాపిడో బైక్పై తరలిస్తోన్న క్రమంలో అవి కిందపడ్డాయి. బాలానగర్ ఫ్లైఓవర్ మీద చెల్లాచెదురుగా పడ్డాయి. అటుగా వెళ్లే వాహనదారులు వాటిని భద్రపర్చడానికి సంబంధించిన కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పట్టాయి.












Click it and Unblock the Notifications