కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ప్రచ్చన్నయుద్ధం; ధాన్యం కొనేదెవరు? ఆందోళనలో రైతన్నలు
ధాన్యం కొనుగోలు రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుచేసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒప్పందం మేరకు పారా బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తేలేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఇక అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మధ్య ధాన్యం కొంటారా కొనరా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు.
ఆవులు ఆవులు కొట్టాడుకుంటే లేగల కాళ్ళు విరిగిన చందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న రైస్ వార్ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు ప్రభుత్వాలు సయోధ్యతో రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోతే తమ పరిస్థితి ఏంటి అన్న చర్చ రైతులను ఆందోళనకు గురి చేస్తుంది.

కేంద్రం వద్ద మూడేళ్ళకు సరిపడా ధాన్యం నిల్వలు
చాలా సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను సేకరించి, బియ్యాన్ని మరపట్టించిన తర్వాత తమకు అవసరం ఉన్నంత మేరకు ఉంచుకొని మిగతా బియ్యాన్ని కేంద్రానికి పంపిస్తున్నాయి. అలా రైతుల నుంచి రాష్ట్రాన్ని సేకరించిన మొత్తం ధాన్యానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఆ బియ్యాన్ని కేంద్రప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో నిల్వ చేస్తుంది. అయితే ప్రస్తుతం కేంద్రం దగ్గర మూడేళ్ల అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

కేంద్రం ధాన్యం కొనుగోలు చెయ్యాలని టీఆర్ఎస్ ఆందోళన బాట
ఈ నేపథ్యంలోనే ఈసారి బియ్యం కొనుగోలు చేయటం సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతాంగం సాగుచేసిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనంటూ ఆందోళన బాట పట్టింది. వరి సేకరణపై అటు బిజెపి ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య పెద్ద యుద్ధమే కొనసాగుతుంది. ఇక ఏకంగా సీఎం కెసీఆర్ రంగంలోకి దిగి ఢిల్లీ వేదికగా మహా ధర్నా నిర్వహించి రైతుల ధాన్యం కొనాలని, దేశమంతా ఒకే సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేశారు.

కొనసాగుతున్న యాసంగి కోతలు.. ధాన్యం కొంటారా ? కొనరా? రైతుల ముందున్న ప్రశ్న
ఇదిలా ఉంటే తెలంగాణలో యాసంగి పంట ప్రస్తుతం కోతల దశలో ఉంది. కొద్దిరోజుల్లో కోతలు కూడా పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. కానీ వరి కొనుగోలు వ్యవహారం ఇంతవరకు కొలిక్కి రాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
యాసంగి పంట మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గట్టి పట్టుబడుతున్న నేపథ్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారా లేదా అన్నది ప్రస్తుతం రైతుల ముందున్న పెద్ద సమస్య. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్నారా అన్న ప్రశ్న కూడా ప్రస్తుతం తెలంగాణ రైతాంగంలో ఉత్పన్నమౌతుంది.

సడన్ గా చెప్తే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించలేకపోయిన రైతులు
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి సాగు చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండడం వల్ల రైతులు యాసంగిలోనూ వరి సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలని వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఒక్కసారిగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించలేకపోయారు.
అయితే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందుకు తగిన ప్రోత్సాహం అందించాలి. ఇక ఆ పని చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో ఈ సంవత్సరం కూడా యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు.

రాజకీయాలు పక్కనబెట్టి ధాన్యం కొనుగోలు విషయం తేల్చండి అంటున్న రైతులు
ఈ మొత్తం వ్యవహారంలో రైతుల తప్పేమీ లేదు. మద్దతు ధర వస్తుంది కాబట్టి యాసంగి లోను రైతులు వరి సాగు చేశారు. ఇక ఇప్పుడు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడంలో రోజుకో రాజకీయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులు ధాన్యం కొనుగోలు విషయాన్ని ఎటూ తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ పరిస్థితులు తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. మీ రాజకీయాలు పక్కనపెట్టి మా విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని రైతన్నలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications