బస్సుల్లో ప్రయాణీకులను మధ్యలో దింపేస్తున్న కండక్టర్లు .. ఎందుకో తెలిస్తే షాక్
అసలే ఎండాకాలం... ఆర్టీసీ బస్సులలో ప్రయాణం.. మండే ఎండల్లో ప్రయాణం చేస్తున్న హింస చాలదన్నట్టు బస్సులో కాస్త దూరం వెళ్ళాక బస్సు పక్కనే ఆపి ఇక దిగండి తర్వాత వచ్చే బస్సులో ఎక్కండి అంటూ కండక్టర్ సూచన. బస్ ఏమైనా రిపేర్ వచ్చిందా అని తీరా ఆరా తీస్తే బస్సు కాదట టికెట్ ఇచ్చే టిమ్ యంత్రాలు పని చేయడం లేదని చావు కబురు చల్లగా చెప్తారు. ఇది మన ఆర్టిసి బస్సుల పరిస్థితి.బస్సులో టికెట్ యంత్రాలు మొరాయిస్తున్నా పట్టింపులేని తెలంగాణ ఆర్టీసీపై మండుటెండలో బస్సు దిగిన ప్రయాణికులు మండిపడక మరి ఏం చేస్తారు.
ఇక అసలు విషయానికొస్తే పరిగి నుండి వికారాబాద్ కు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బస్సు ఆపి వెనకాల వచ్చే బస్సులో ఎక్కండి అంటూ బస్సు కండక్టర్ మధ్యలో దించేశాడు. బస్సు పాడైపోయింది అనుకొని ఏం జరిగిందని ఎంక్వయిరీ చేసిన ప్రయాణికులు టిక్కెట్లు జారీ చేసే టిమ్ యంత్రం పని చేయకపోవడంతో మధ్యలోనే దించేశారని తెలుసుకున్నారు. ఇక ఆ బస్సు వెళ్లిపోయిన తరువాత వచ్చే బస్సులు ఎక్కుదామని మండుటెండలో ప్రయాణికులు 40 నిమిషాల పాటు ఎదురుచూశారు. రెండు బస్సులు వచ్చినా ఆపకుండానే వెళ్లిపోయాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆటోలో వికారాబాద్ కు చేరుకున్నారు ప్రయాణికులు. ఇక దీంతో ఆర్టీసీ యాజమాన్యంపై నిప్పులు చెరుగుతున్నారు.
గతంలో మాదిరి పేపర్ టికెట్లను కండక్టర్ వద్ద అందుబాటులో ఉంచాలని, టిమ్ యంత్రం పని చేయకపోతే కనీసం పేపర్ టికెట్లు అయినా ఉపకరిస్తాయని వారంటున్నారు.
ఇక ఈ తరహా సంఘటనలు తరచూ ఆర్టీసీ బస్సుల్లో చోటుచేసుకుంటున్నాయి. దీంతో అటు ఆర్టీసీ సిబ్బందికి, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికులకు టికెట్స్ ఇచ్చే టిమ్ యంత్రాలకు కనీసం పది గంటల ఛార్జింగ్ ఉండాలి. కానీ అవి ఒక గంట కూడా చార్జింగ్ ఉండటం లేదు. వాటి గురించి పట్టించుకోవాల్సిన అధికారాలు అవేవీ పట్టించుకోవటం లేదు . దీంతో ప్రయాణికులకు టికెట్లు ఇవ్వలేక ఆర్టీసీ సిబ్బంది, మధ్యలోనే దింపేస్తుంటే ఇబ్బందులు పడుతూ ప్రయాణికులు నానా చావు చూస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ దీనిపైన దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.