ఆత్మగౌరవాన్ని ఈటల ఢిల్లీలో తాకట్టు పెట్టారు-పతనం మొదలైనట్లే : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ గట్టి ఫోకస్ పెట్టింది. మంత్రులు,ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మోహరించింది. అభివృద్ది పనులను పరుగులు పెట్టిస్తోంది. అర్హులైన వారికి వెంటనే సంక్షేమ కార్యక్రమాలు అందేలా చర్యలు చేపడుతోంది. ఏం చేసైనా సరే హుజురాబాద్లో గులాబీ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్లో పర్యటించారు.
బీజేపీలో చేరికతోనే ఈటల పతనం మొదలైందని ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈటల ఢిల్లీలో తాకట్టు పెట్టి వచ్చారని విమర్శించారు. అలాంటి వ్యక్తి ఆత్మగౌరవం గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. బీజేపీలో చేరిన ఈటలకు ప్రజలు బుద్ది చెబుతారని... ఆయన ప్రజాగ్రహానికి గురికాక తప్పదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే హుజురాబాద్లో పార్టీని గెలిపిస్తాయని ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు.

అంతకుముందు కమలాపూర్లో పర్యటించిన చల్లా ధర్మారెడ్డి మహిళా సర్పంచ్ తిరుపతమ్మను అవమానించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమెకు కూర్చొనేందుకు కుర్చీ కేటాయించకపోవడంతో నిలబడే ఉండిపోయారు. దీంతో ధర్మారెడ్డిపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో దళితులను అవమానపరిచిన ధర్మారెడ్డి... ఇప్పుడు మహిళా సర్పంచ్ను అవమానించారని మండిపడ్డాయి. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
కాగా,హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఉపఎన్నికలో ఈటలను ఓడించడం ద్వారా రాజకీయంగా ఆయన్ను చావు దెబ్బ తీయాలని భావిస్తోంది. కేసీఆర్ను వీడినవాళ్లెవరూ రాజకీయాల్లో రాణించలేరన్న విషయాన్ని నిరూపించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వ్యూహాలు,అస్త్రాలను సిద్దం చేస్తోంది. పక్కా ప్రణాళికతో ఉపఎన్నికను ఎదుర్కొనేలా వేగంగా పావులు కదుపుతోంది.
ఈ క్రమంలో పలువురు మంత్రులు,టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే హుజురాబాద్లో మకాం వేసి ఇంటింటికీ తిరిగే పనిలో నిమగ్నమయ్యారు. కింది స్థాయి కార్యకర్తలు మొదలు చిన్నా,పెద్ద నేతలందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు.
Recommended Video
మరోవైపు హుజురాబాద్లో గెలుపు ఈటలకు చావో రేవో అన్నట్లుగా తయారైంది. కేసీఆర్ను ఢీకొట్టే సత్తా తనకు ఉందని నిరూపించుకోవాలంటే ఉపఎన్నికలో గెలిచి తీరాలి. ఒకవేళ ఈటల ఓటమిపాలైతే బీజేపీలోనూ ఆయన్ను లైట్ తీసుకునే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి ఈటల కూడా హుజురాబాద్పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. బీజేపీ నేతలతో కలిసి వ్యూహాలు రచించే పనిలో నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications