ప్రేమ పేరుతో సహజీవనం; తీరా పెళ్లి టైమ్ కి వరుడు మాయం; వధువుకు మిగిలిన దుఃఖం
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని ఒకరు ఇష్టపడిన వారు అక్కడితో ఆగకుండా సహజీవనం కూడా చేశారు. ఓ శుభ ముహూర్తాన ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే ముహూర్త సమయానికి వరుడు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో వధువు కన్నీరుమున్నీరవుతుంది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల లో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

ప్రేమించి సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానన్న యువకుడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవానగరం గ్రామానికి చెందిన గౌతమి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్న గూడెం గ్రామానికి చెందిన రాజకుమార్ లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు. అయితే శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇక పెళ్లి చేసుకోడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వధువు ముస్తాబై పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

పెళ్లి సమయానికి హ్యాండ్ ఇచ్చిన వరుడు ..
ఎంతసేపటికీ వరుడు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన వధువు కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ముహూర్తానికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో మండపానికి చేరుకోకపోవడంతో వధువు పెళ్లి కుమారుడుకి ఫోన్ చేసింది. కాసేపు వస్తున్నానని చెప్పిన పెళ్లి కొడుకు, ఆ తర్వాత తనకు వేరే అమ్మాయితో పరిచయం ఉందని, ఆ అమ్మాయి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ రకరకాల కారణాలు చెప్పి తాను రాలేనని తప్పించుకున్నాడు. ఇక చివరగా తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు.

వధువు కన్నీటి పర్యంతం ..పోలీసులకు ఫిర్యాదు
దీంతో పెళ్లిపీటల పైనే యువతి కన్నీటి పర్యంతమైంది. ఏం చేయాలో అర్థం కాని దిక్కు తోచని స్థితిలో న్యాయం కోసం పెళ్లి బట్టలతోనే చర్ల పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు చర్ల పోలీసులు, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, రాకుండా తప్పించుకున్న యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video

నిత్యకృత్యంగా మారుతున్న ప్రేమ పేరుతో మోసాలు
ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఇటువంటి వ్యవహారాలు ప్రస్తుతం నిత్యకృత్యంగా మారాయి. ప్రేమిస్తున్నాను అని చెప్పడం, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం, శారీరకంగా యువతితో అవసరాలు తీరిన తర్వాత పెళ్లి చేసుకోనని నిరాకరించటం పరిపాటిగా మారింది. అబ్బాయి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అమ్మాయిలు గుడ్డిగా నమ్మి మోసపోతున్న ఇటువంటి అనేక సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమ్మాయిల్ని మోసం చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవడమే కాదు, అమ్మాయిలకు మోసపోకుండా ఉండేవిధంగా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications