అమెరికాలో సంకీర్త్ హత్య: వీడని మిస్టరీ, మకాం మార్చిన మిత్రుడు
హైదరాబాద్: అమెరికాలో రూమ్మేట్ చేతిలో హత్యకు గురైన సంకీర్త్ కేసు మిస్టరీ వీడడం లేదు. సంకీర్త్ను తోటి తెలుగువాడు సాయి సందీప్ గౌడ్ హతమార్చినట్లు భావిస్తున్నప్పటికీ హత్యకు కారణమేమిటనేది తెలియడం లేదు. సంకీర్త్ స్నేహితుడు ప్రణీత్ కూడా విషయాలను సరిగా చెప్పడం లేదని సంకీర్త్ కుటుంబ సభ్యులు అంటున్నారు.
హైదరాబాదులోని కాచిగూడకు చెందిన సంకీర్త్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో విద్యానగర్కు చెందిన ప్రణీత్తో స్నేహం ఏర్పడింది. అమెరికాలోని ఆస్టిన్లో సంకీర్త్, ప్రణీత్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. హైదరాబాద్కే చెందిన సాయి సందీప్గౌడ్ 15 రోజుల క్రితం వారితో చేరాడు.
సంకీర్త్ హత్యకు కారణమేమిటో!: కలల అమెరికాలో బలవుతున్నారు
సంకీర్త్ను నిందితుడు సందీప్ కత్తితో పొడిచినపుడు ప్రణీత్ అదే గదిలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఎందుకు పొడిచాడనే విషయాన్ని ప్రణీత్ చెప్పడం లేదు. తాను పడుకుని ఉన్నానని, ఎందుకు చంపాడో తెలియదని ప్రణీత్ చెబుతున్నాడని సంకీర్త్ బంధువులు చెబుతున్నారు.
సందీప్ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య జరిగినప్పుడు గదిలో ఉన్న ప్రణీత్ను కూడా పోలీసులు విచారించినట్లు సమాచారం. తర్వాత అతణ్ని విడిచిపెట్టడంతో డల్లాస్కు మకాం మార్చాడని అంటున్నారు. హత్యకు సంబంధించి తమకెలాంటి సమాచారం ఇవ్వడం లేదని, ఫోన్లో కూడా అందుబాటులో లేడని సంకీర్త్ బంధువులు అంటున్నారు.
సందీప్కు, సంకీర్త్కు మధ్య ఏ విషయంపై గొడవ జరిగిందీ, హత్యకు దారి తీసేంత తీవ్రమైన తగాదాలు వారిద్దరి మధ్య ఏం ఉన్నాయనేది అంతు చిక్కడం లేదు. సందీప్ తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతానికి చెందినవాడనే విషయం కూడా తేలడం లేదు.
సంకీర్త్ మృతదేహానికి అమెరికాలోని ఆస్టిన్లో శవపరీక్ష పూర్తయిందని, హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు మూడు, నాలుగురోజులు పట్టవచ్చని అంటున్నారు. సంకీర్త్ మరణించిన విషయాన్ని తల్లి రమాదేవికి ఇప్పటికీ చెప్పలేదు. న్యూజెర్సీ నుంచి హైదరాబాదుకు సంకీర్త్ మృతదేహాన్ని పంపించేందుకు అమెరికాలోని తెలుగువారు సాయపడుతున్నారు.
ఇదిలావుంటే, కాచిగూడలోని సంకీర్త్ కుటుంబాన్ని బిజెపి నాయకుడు కిషన్రెడ్డి బుధవారం పరామర్శించారు. మృతుడి తండ్రి విజయ్కుమార్, పెదనాన్న సుధాకర్తో మాట్లాడారు. మృతదేహాన్ని వెంటనే నగరానికి రప్పించేలా చూడాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ను ఆయన కోరారు.