ఎన్నికల కమిషన్ ను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని.!ప్రజాస్వామ్యానికి మోడీ విధానాలు గొడ్డలిపెట్టన్న వినోద్ కుమార్.
హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యవహారంపై గులాబీ పార్టీ నాయకుడు మండి పడ్డారు. పటిష్టమైన రాజ్యాంగబద్ద వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద సంస్థలతో పాటు ఆర్థికంగా పరిపుష్టి సాధించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసేందుకు ప్రధాని మోదీ తహతహలాడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు దుష్పలితాలనిస్తాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ లతో పీఎంవో రహస్య భేటీ ఆక్షేపనీయం..ఇది దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్న వినోద్
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సర్వోత్తమ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ లతో ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు రహస్యంగా సమావేశం ఇటీవల సమావేశం కావడం ఆక్షేపనీయమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పీఎంవో తీరు భారత దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వినోద్ కుమార్ అన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ పై కేంద్ర ప్రభుత్వం పెత్తనం సరికాదు.. ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్న వినోద్
కేంద్ర ఎన్నికల కమిషన్ పై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ప్రపంచ దేశాలు భారత దేశ ఎన్నికల కమిషన్ పని తీరును అనేక సందర్భాల్లో కొనియాడాయని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ప్రతి సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న ఘన చరిత్ర కేంద్ర ఎన్నికల కమిషన్ కు దక్కుతుందని వినోద్ కుమార్ వివరించారు.
ఎన్నికల కమిషన్ ను సర్వ స్వతంత్రంగా పని చేసుకోనివ్వాలి.. కేంద్రం పెత్తనం ఎందుకుకన్న వినోద్
అలాంటి గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన కనుసన్నల్లో పెట్టుకోవాలని చూడటం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదిగా ఉందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ను సర్వ స్వతంత్రంగా పని చేసుకునే విధంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వినోద్ కుమార్ స్పష్టం చేసారు.
ఎన్నికల కమిషన్ విధుల్లో మోడీ సర్కార్ జోక్యం చేసుకోవడం మానుకోవాలని.. లేదంటే ఉద్యమిస్తామన్న వినోద్
కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల్లో మోడీ సర్కార్ జోక్యం చేసుకోవడం మానుకోవాలని, లేదంటే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకుతుందని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశాలకు గత 20 ఏళ్లుగా టీ.ఆర్.ఎస్. పార్టీ తరఫున తాను హాజరవుతున్నానని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశాలకు బీజేపీ నాయకులు హాజరై తమ విజ్ఞప్తులు తెలుపుకునే అవకాశం ఉందని వినోద్ కుమార్ అన్నారు.