తెలంగాణలో పవన్కు వై కేటగిరి సెక్యూరిటీ: రోడ్డు మార్గంలో క్షేత్రదర్శనం
Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతోండటం ఇదే తొలిసారి. ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణలో వై సెక్యూరిటీ భద్రతను పవన్ కల్యాణ్కు కల్పించారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన మాల ధారణ చేశారు. 11 రోజులపాటు నిష్ఠగా ఈ దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పాలు, పండ్లు, ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కూడా ఆయన ఇదే దీక్ష చేశారు.

ఈ నెల 29వ తేదీన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. తమ ఇంటిదైవం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొక్కులు చెల్లించనున్నారు. గత ఏడాది ఇదే ఆలయాన్ని సందర్శించారాయన. వారాహి వాహనానికి పూజలు చేయించారు అప్పట్లో. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు.
ఉదయం 7 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరుతారు పవన్ కల్యాణ్. 11 గంటలకు కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆలయంలో గడుపుతారు. స్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
అనంతరం రోడ్డు మార్గంలోనే కొండగట్టు నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు ఇంటికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ పర్యటన సమయంలో పవన్ కల్యాణ్కు వై కేటగిరి భద్రత కల్పించాలంటూ ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీపీ..తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications