చంద్రబాబును నమ్మి కేసిఆర్ను తిట్టి తుదకిలా అయ్యారు
హైదరాబాద్: తెలుగుదేశం తెలంగాణ పార్టీ నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లయ్యారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పూర్తిగా నమ్ముకున్నవాళ్లు. ఆయనపై నమ్మకంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టినవారు.
రేవంత్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ చంద్రబాబను తమ నాయకుడిగా నమ్ముకుని ఆయనపై ఎనలేని విశ్వాసాన్ని ఉంచినవారే. వారు తలో దిక్కయ్యారు. తాజాగా మోత్కుపల్లి నర్సింహులు పరిస్థితి దారుణంగా తయారైంది.
నాగం జనార్దన్ రెడ్డి ఇలా...
నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమ నాయకత్వం విషయంలో అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావుతో విభేదాలు పొడసూపాయి. చంద్రబాబు నాగం జనార్దన్ రెడ్డి వెనకేసుకొచ్చినట్లే కనిపించారు. కానీ చివరకు ఆయన తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చింది.
ఇప్పుడిలా అయ్యారు...
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ కోసం ఓ వేదికను ఏర్పాటు చేశారు. దాన్ని పార్టీగా కూడా మార్చారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరారు. బిజెపిలో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడ్డారు. కాంగ్రెసులోని ముఖ్య నాయకుల నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదరవుతోంది.
తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా...
తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న కాలంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నాయకుల్లో ఒకరిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మెలిగారు. ఆ కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్పై ఆయన దుమ్మెత్తిపోస్తూ వచ్చారు. అయితే, కేసీఆర్ అధికారంలోకి రాగానే టిడిపి నుంచి గెలిచి టిఆర్ఎస్లో చేరిపోయి, కేసీఆర్ మంత్రివర్గంలో చేరిపోయారు. హైదరాబాదులో బలమైన నాయకుడు కావడంతో తలసాని అవసరం కేసీఆర్కు కనిపించింది. దాంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సేఫ్గా బయటపడ్డారు.
రేవంత్ రెడ్డి ఇలా...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ను మాటల తూటాలతో ఎదుర్కోగలిగే నాయకుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. తెలంగాణలో టిడిపి తరఫన కేసీఆర్ను ఎదుర్కోవడానికి సిద్దపడ్డారు. చంద్రబాబు ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ స్థితిలో మోత్కుపల్లి నర్సింహులుకు, రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు పొడసూపాయి. చివరకు రేవంత్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరిపోయారు.
Recommended Video
తాజాగా మోత్కుపల్లి....
కేసీఆర్ను తన మాటల ఈటెలతో ఎదుర్కున్న నాయకుడిగా మోత్కుపల్లి నర్సింహులుకు గుర్తింపు ఉంది. మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుకు అతి ముఖ్యమైన నాయకుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. చంద్రబాబుపై నమ్మకంతో ఆయన కేసీఆర్ను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. చివరకు ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. ఆయన టీడిపి గూడు విడిచే వాతావరణమే ఉందని అంటున్నారు. ఆయన ఎటు వెళ్తారనేది చెప్పడం కష్టమే
కథ అడ్డం తిరిగి...
చంద్రబాబు రాజకీయ వ్యూహం దెబ్బ తిని తెలంగాణను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటుకు నోటు కేసు ఆయనను తీవ్రంగా దెబ్బ తీసింది. కారణమేదైనా గానీ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కేసిఆర్ను బలంగా ఎదుర్కుందామని భావించిన చంద్రబాబుకు పరిస్థితులు కలిసి రాలేదు. దాంతో కేసిఆర్తో స్నేహం చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన తనకు విశ్వాసపాత్రులుగా ఉన్న నాయకులను దూరం చేసుకోవాల్సిన స్థితిలో చిక్కుకున్నారు.