TSLPRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తూ నోటిఫికేషన్..
కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రకారం కానిస్టేబుల్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు తగ్గిస్తూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు ఆదివారం సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్ట్ 28న ప్రిలిమినరీ పరీక్ష రాశారు. గతంలో జనరల్ కేటగిరీకి 40%, బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీలకు30% కటాఫ్ మార్కులు నిర్ణయించి నియామకాలు చేశారు.
30 శాతం కటాఫ్ మార్కలు
అయితే ఈసారి జనరల్ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలకు 30% మార్కులను కటాఫ్గా నిర్ణయించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయమై అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. దీంతో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. దానికి తగ్గట్లుగా తాజాగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
తగ్గిన కటాఫ్ మార్కులు
ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం బీసీ అభ్యర్థులకు 25%, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ కేటగిరీకి 20% మార్కులు కటాఫ్గా నిర్ణయించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మొత్తం 6,61,198 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రిలిమినరీ పరీక్షకు 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 200 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఇసారి నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి.
ఎవరికి ఎన్ని మార్కులు రావాలంటే..
200 మార్కులకు కటాఫ్ మార్కుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ కేటగిరీకి వారికి 40 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. బీసీలకు 50 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. జనరల్ కేటగిరీ 60 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.