సాగర్ ఉపపోరులో ఎవరి ధీమా వారిదే.!నెలకొన్న త్రిముఖ పోటీ.!గులాబీ పార్టీకి అంత ఈజీ కాదంటున్న విశ్లేషకులు.!
నాగార్జున సాగర్/హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, సాగర్ ప్రజల తీర్పు ఈ సారి భిన్నంగా ఉండే అవకాశం ఉందనే అంచనాలు తెరమీదకు వస్తున్నాయి. అధికార గులాబీ పార్టీ ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలని పట్టుదతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికలో ఏంజరిగిందో అదే పునరావృతం చేస్తామని భరోసా వ్యక్తం చేస్తోంది. దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది.
రసవత్తరంగా సాగర్ ఉప ఎన్నిక..
రాష్ట్ర రాజకీయాల దృష్టి ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నికపై కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజకీయ పార్టీలు తాజాగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. సహజంగా ఉప ఎన్నికల ఫలితాలు ఎక్కడైనా అధికార పార్టీకి కాస్త అనుకూలంగా వస్తుంటాయి. కానీ స్థానికంగా నెలకొన్న పోటీ, రాజకీయ పార్టీలమధ్య కొనసాగుతున్న పట్టుదల వల్ల పోటీ ఆసక్తికరంగా మారింది. నాగార్జున సాగర్ లో కూడా ఇదే వ్యవహారం కొనసాగుతుండడంతో రాజకీయ పార్టీల మధ్య ఉత్కంఠ మొదలైనట్టు తెలుస్తోంది.
నల్లేరు మీద నడక కాదు..
ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార గులాబీ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. సాగర్ స్థానం తమదే కనుక ఉప ఎన్నికలో కూడా గెలిచి సత్తా చాటుకోవాలని అధికార పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు సిట్టింగ్ స్థానం అయిన దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప పోరులో అధికార పార్టీ పరాజయం పాలైంది. దీంతో ప్రజల్లో గులాబీ పార్టీబలహీనపడిందనే అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించి, సాగర్ ప్రజలు అధికార పార్టీ వెంటే ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని అధికార పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ..
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి సాగర్ నియోజకవర్గం నుండి గతంలో ఏడుసార్లు గెలుపొందడంతో అది సిట్టింగ్ స్దానంగా కాంగ్రెస్ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఉప ఎన్నికలో పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ. సాగర్ నియోజక వర్గాన్ని అభివృద్ది చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, అందుకోసం కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో ఓ అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలను పక్కన పెట్టి నాయకులందరూ సీనియర్ నేత జానారెడ్డి గెలుపుకోసం కృషి చేస్తుండడం, సాగర్ లో మొహరించి ప్రచారంలో పాల్గొనడం మంచి పరిణామమనే చర్చ చోటుచేసుకుంది.
దుబ్బాక ఫలితాన్ని పునరావృతం చేస్తాం..
ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం దుబ్బాక ఫలితాన్ని సాగర్ లో కూడా పునరావృతం చేస్తామని పట్టుదల వ్యక్తం చేస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఫలితం రాబడుతామనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ, అదికార గులాబీ పార్టీ రెండూ కూడా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను ఓట్లడుగుతాయని, బారతీయ జనతాపార్టీ మాటల పార్టీ కాకుండా చేతల పార్టీ అని, సామాన్య ప్రజానికానికి న్యాయం చేసేది ఒకే ఒక పార్టీ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేసింది బారతీయ జనతా పార్టీ. ప్రధాన మంత్రిగా మోదీ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో, దేశాన్ని ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారో అనే అంశాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది బీజేపి. ఆ దిశగా సాగర్ లో ఉప ఎన్నికలో గెలుపు ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది బీజేపి. దీంతో సాగర్ ఉప పోరులో గెలుపు పట్ల ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.