స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు వీరే.. వాళ్లకు మినహాయింపు!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. రిజర్వేషన్ల ఆధారంగా పక్కా వ్యూహంతో అభ్యర్థులను బరిలోకి దింపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు అధికారులు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
వీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి అనర్హతలను పేర్కొంది. ముఖ్యంగా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఇది గతంలో కూడా అమల్లో ఉన్న నిబంధననే.

కొత్త మార్గదర్శకాల ప్రకారం అనర్హులు వీరే
అంతే కాదు కొత్త మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ సేవకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలలో పనిచేసే ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులని పేర్కొంది. పార్లమెంటు లేదా శాసనసభ చట్టాల ద్వారా ఏర్పడిన సంస్థలలో ప్రతినిధులుగా ఉన్నవారు, సింగరేణి, ఆర్టీసీ లలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసేవారు పోటీ చేయడానికి అనర్హులని పేర్కొంది.
వీరు పోటీ చెయ్యకూడదు
మతపరమైన సంస్థలకు చైర్మన్లుగా ఉన్నవారు, సభ్యులుగా ఉన్నవారికి ఈ ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పనులకు కాంట్రాక్టర్లుగా ఉన్నవారు, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 పరిధిలోకి వచ్చే కేసులలో శిక్ష పడిన వారు కూడా ఎన్నికల్లో పోటీకి అనర్హులు.
పోటీ చెయ్యాలంటే ఇవి మస్ట్.. వీరికి మినహాయింపు
ఇంకా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ల పరిశీలన తేదీ నాటికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా గ్రామంలో లేదా నియోజకవర్గంలో ఓటు హక్కును కలిగి ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే వారిలో రేషన్ డీలర్లకు మినహాయింపును ఇచ్చింది ఎన్నికల సంఘం. దీంతో రేషన్ డీలర్లు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయవచ్చు.












Click it and Unblock the Notifications