దొంగకు షాక్: కాళ్లు విరగ్గొట్టుకున్నాడు, పట్టుబడ్డాడు

హైదరాబాద్: పట్టపగలు దొంగలు ఓ గృహిణిని బంధించి దోపిడీకి విఫలయత్నం చేశారు. దొంగలు ఇంట్లోకి చొరబడిన సమయంలో ఆమె భర్త రావడంతో కిటికీలో నుంచి బాల్కనీలోకి వెళ్లి రెండో అంతస్థు నుంచి కిందికి దూకారు. ఓ దొంగ పారిపోగా, కాళ్లు విరిగిపోవడంతో నడవలేక మరో దొంగ పట్టుబడ్డాడు. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం హైదరాబాదులో జరిగింది.

సోమాజిగూడ, రాజ్‌భవన్‌రోడ్‌లోని మార్వెల్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌ 302 ఫ్లాట్‌లో సజ్జన్‌ రాజ్‌ జైన్‌, అనితాదేవి దంపతులు నివాసముంటున్నారు. జైన్‌ స్థానికంగా ఆటో ఫైనాన్స్‌ సంస్థను నడుపుతున్నారు. మంగళవారం ఆయన ఫైనాన్స్‌ కార్యాలయానికి వెళ్లగా అనితాదేవి ఒక్కటే ఇంట్లో ఉంది. ఒంటి గంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి తలుపు తట్టడంతో పాటు బెల్‌ నొక్కారు. అనితాదేవి తలుపు తీయగానే, సార్‌ పంపించారు...డబ్బులు ఇంట్లో ఇవ్వమని చెప్పారని నమ్మబలికారు. దీంతో ఆమె వారిని లోపలికి రమ్మని చెప్పింది.

భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆగంతుకులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. తమతో తెచ్చుకున్న స్ర్పేను ఆమె ముఖంపైన చల్లారు. కాళ్లు,చేతులు కట్టేశారు. ఓ ఆగంతకుడు ఆమె అరవకుండా చేతిని అడ్డుపెట్టి ఇంట్లో నగలు, నగదు ఎక్కడ ఉన్నాయో చెప్పాలంటూ అడిగాడు. ఆమె చెప్పకపోవడంతో చంపుతానని బెదిరించాడు. ఆగంతుకులు ఇద్దరూ కలిసి బెడ్‌రూంలోకి వెళ్లి పరిశీలిస్తుండగా ఇంట్లోని కాలింగ్‌ బెల్‌ మోగింది.

 Thief injured as jumped from the building in Hyderabad

ఓ ఆగంతుకుడు తలుపునకు ఉన్న చిన్న కంతలో నుంచి చూడగా బయట ఓ వ్యక్తి కనిపించాడు. దీంతో ఇద్దరూ కిటికీ తలుపులు తీసుకుని బాల్కనీలోకి వెళ్లి రెండో అంతస్థు నుంచి కిందికి దూకారు. ఓ ఆగంతుకుడు పారిపోగా, కాళ్లు విరగడంతో నడవలేనిస్థితిలో మరొకడు పట్టుబడ్డాడు. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. పంజాగుట్ట పోలీసులు ఫ్లాట్‌ వద్దకు వెళ్లి తలుపు తెరిచి చూడగా అనితాదేవి కాళ్లు,చేతులు కట్టేసి ఉన్నాయి. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సజ్జన్‌ రాజ్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలిసినవారి పనేనా....

మొత్తం నలుగురు ఆగంతుకులు ఇన్నోవా వాహనంలో మార్వెల్‌ రెసిడెన్సీ వద్దకు వచ్చారు. ఇద్దరు కిందనే ఉండి పరిసరాలను గమనిస్తుండగా, మరో ఇద్దరు పైకి వెళ్లారు. ఇది తెలిసిన వారి పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సజ్జన్‌రాజ్‌ వద్ద గతంలో పనిచేసిన వారు లేదా ఆటో ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నవారు ఈ సంఘటనకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు జైన్‌ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి భోజనం చేసి మందులు వేసుకునే అలవాటు ఉంది. ఇదే అలవాటు దోపిడీ జరగకుండా కాపాడింది.

దోపిడీకి పథకం వేసింది నలుగురు ఆగంతకులుగా తేలింది. పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డ ఆగంతకుడిని పోలీసులు విచారించగా బోరబండకు చెందిన కారు డ్రైవర్‌ మహ్మద్‌ లతీఫ్‌ (35)గా తేలింది. దోపిడీ ఘటనకు వాడింది ఇతడి ఇన్నోవా వాహనమని తెలిసింది. ఆగంతుకులు ఇదే కారులో పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ మోహన్‌కుమార్‌, డీఐ వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు సందర్శించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం రాత్రి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+