కరోనా మృతులను అమరవీరులతో పోల్చిన అసదుద్దీన్: ఢిల్లీ ప్రార్థనలపై తొలిసారిగా స్పందన
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. అమరవీరులతో పోల్చారు. కరోనా వల్ల మరణించిన వారు అమరవీరులతో సమానమని, వారి మృతదేహాలకు వేర్వేరు మతాల ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు. అమర వీరుల పార్థివ దేహాలను గౌరవించినట్టుగా కోవిడ్-19 మృతదేహాలను శుద్ధి చేయడం, కఫన్ కప్పడం వంటివి చేయాల్సిన పని లేదని అన్నారు.
Recommended Video
ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంత్యక్రియల విషయంలో కొద్దిగా సడళింపులను ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒవైసీ అన్నారు. కరోనా వల్ల మరణించిన వారి అంత్యక్రియల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్దుష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించట్లేదని తెలిపారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన సామూహిక తమ ప్రార్థనల వల్ల దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోయాయంటూ మీడియాలో వస్తోన్న వార్తలను ఆయన తోసివేశారు. చావుకు కులం, మతం అనేది లేదని, ఒక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. ఏ మతమైనా ప్రజల మరణాన్ని కోరుకోదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు.
అయినప్పటికీ- కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కరోనా మృతులకు మతం రంగును పులిమే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ సామూహిక మత ప్రార్థనలను నిర్వహించే సమయంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిసిందేనని అన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చినప్పటికీ- దేశంలో అనేక ఆలయాలు తెరిచే ఉంచారని గుర్తు చేశారు. ఢిల్లీ మత ప్రార్థనల తరువాత దేశంలో నెలకొన్న పరిస్థితులను అరికట్టడంపై కేంద్రం దృష్టి సారించాలని హితవు పలికారు.