ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రాజీనామా..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో కొత్త శాసనసభ ఈ రోజు కొలువు తీరింది. ఇదే సమయంలో సీనియర్లను కాదని ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను ఎంపిక చేయటం పైన బీజేపీ కొత్త ఆరోపణలు చేస్తోంది. రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపిస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ మెజార్టీలో ఉండగా.. మండలి లో బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు రాజీనామా చేసారు.
ముగ్గురు రాజీనామా:బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కారణంగా తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఛాంబర్లో కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. రాజీనామాలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. అసెంబ్లీలో అధికారం దక్కించుకోవటానికి కావాల్సిన మెజార్టీ కంటే నాలుగు స్థానాలను కాంగ్రెస్ ఎక్కువగా గెలుచుకుంది. కానీ, మండలిలో మాత్రం 0 సీట్లకుగాను.. 28 మంది టీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారు. ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు.

మండలిలో బీఆర్ఎస్ బలం:తాజాగా ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాజీనామా చేసారు. వీరిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి , పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి స్థానిక సంస్థల కోటా సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి సైతం రాజీనామా చేసారు. దీంతో, నాలుగు స్థానాలు ఖాళీలు అయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీల రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు. కానీ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. మండలిలో సంఖ్యా బలం పెంచుకోవటానికి ఖాళీల భర్తీ పైన సీఎం రేవంత్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ కసరత్తు:తాజా ఎన్నికల్లో ఓడిన ఇద్దరు నేతలతో పాటుగా సీట్లు ఇవ్వలేకపోయిన మరో ఇద్దరిని ఎమ్మెల్సీలు చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. రేవంత్రెడ్డికి సన్నిహితుడైన మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ని ఎమ్మెల్సీగా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. 2014లో బీఆర్ఎస్ గెలిచన సమయంలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. కానీ, తరువాతి పరిణామాల్లో మెజార్టీ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి. దీంతో.. మండలిలో పూర్తి ఆధిపత్యం దక్కాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ పార్టీని ఏకపక్షంగా గెలిపించుకుంటే సాధ్యం అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications