టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం.. క్యాంపు కార్యాలయంపై పిడుగు..
నల్గొండ జిల్లా దేవరకొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం దేవరకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంపై పిడుగు పడింది. ఆ సమయంలో ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయంలోనే ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఈదురు గాలికి కిటికీ అద్దాలు పగిలి ఉండవచ్చునని భావించారు. కానీ బయటకు వచ్చి చూడగా పిట్ట గోడపై పిడుగు పడిందని స్థానికులు తెలిపారు. గోడ డ్యామేజ్ అయి ఉండటంతో పిడుగే కారణమని నిర్దారణకు వచ్చారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దేవరకొండతో పాటు చందంపేట, కొండమల్లేపల్లి,చింతపల్లి మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఇటు హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్,ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, తార్నాక, రాంనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, ఎల్బీ నగర్, అల్వాల్, కూకట్ పల్లి, నాగోల్, చింతల్, రామాంతాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాలాచోట్ల ఉరుములు,మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులు వీచాయి. గత రెండు,మూడు రోజులుగా నగరంలో ఆకాశం మేఘావృతమై కనిపంచినప్పటికీ వర్షం మాత్రం పడలేదు. అయితే గురువారం సాయంత్రం మాత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సాధారణ రోజుల్లో అయితే వర్షం కురిసిందంటే చాలు నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తేది. కానీ లాక్ డౌన్ కారణంగా అలాంటి సమస్య లేకుండా పోయింది.
శుక్రవారం కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, ఖమ్మం, జనగామ, గద్వాల్ వనపర్తి, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.