సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ను ఓడించండి: కోదండరామ్
హైదరాబాద్: సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించాలని తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. వారసత్వ, డిపెండెంట్ ఉద్యోగాలకు మేము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ఆదివారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణి ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలే ఎజెండా అని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలపై సర్కారు సానుకూలంగా లేదన్నారు కోదండరామ్. కార్మికులను ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కోదండరామ్ ఆరోపణలు చేశారు.
సింగరేణి ఇంకా సవరించిన ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్ను ఓడించాలని ఆయన కార్మికులను కోరారు.
సింగరేణి కార్మికులకు న్యాయం కలగాలంటే టిఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని కోదండరామ్ కార్మికులను కోరారు. రెండు రోజుల క్రితం కోదండరామ్ ఎవరని కెసిఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు.