వాల్మార్ట్ వద్దంటూ వంటావార్పు: కేసీఆర్పై కోదండ, వీహెచ్ ఫైర్
వరంగల్: ప్రపంచ వ్యాపార దిగ్గజం వాల్ మార్ట్ సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హన్మకొండ చౌరస్తాలో వ్యాపార సంఘాల ఐకాస ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ రాజ్యసభ సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా చోట్ల రిలయన్స్, డీ మార్ట్ లాంటి కార్పొరేట్ సంస్థలు వచ్చి చిన్న చిన్న వ్యాపారులను దెబ్బతీశాయని, అమెజాన్లాంటి ఆన్లైన్ సంస్థల ద్వారా చాలా వరకు స్థానిక వ్యాపారుల అమ్మకాలు తగ్గాయన్నారు. ఇప్పటికే 25 శాతం వ్యాపారాలు తగ్గాయని ఈ సమయంలో వాల్మార్ట్ లాంటి సంస్థలకు తెలంగాణలో అవకాశమిస్తే చిన్న వ్యాపారాలు సంక్షోభంలో పడుతాయన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక దాదాపు 80 శాతం మంది వ్యాపారాలను నమ్ముకొని బతుకుతున్నారని, కార్పొరేట్ సంస్థలు రావడంతో వారి జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి వి హనుమంతరావు మాట్లాడుతూ.. ఎలాంటి ఉద్యమమైనా వరంగల్ నుంచే మొదలైందని, వాల్మార్టుకు వ్యతిరేకంగా ఉద్యలమాన్ని కూడా ఇక్కడి నుంచే మొదలుపెడతామన్నారు.
దేశ వ్యాప్తంగా 20 చోట్ల వాల్మార్టులకు అనుమతిస్తే, ఒక్క తెలంగాణలోనే 10 వాల్మార్ట్ సంస్థలకు అనుమతులివ్వడంలో అంతర్యం ఏమిటో ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలన్నారు. కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ వాల్మార్టు సంస్థతో అంతర్గత ఒప్పందం చేసుకొని, వారితో చేతులు కలిపి ఇక్కడి వ్యాపారుల బతుకులను బజారుపాలు చేయాలని చూస్తున్నారన్నారు.
కేటీఆర్ విదేశాలు తిరగడానికే మూడున్నర ఏళ్లు పట్టిందన్నారు. తెలంగాణ పోలీసులు ముఖ్యమంత్రి మాటలు విని ప్రతిపక్ష పార్టీల ఉద్యమాలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, త్వరలో తమ ప్రభుత్వం వస్తుందని, జాగ్రత్త అని హెచ్చరించారు.
సీసీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. వాల్మార్టు సంస్థలకు అనుమతులు ఇచ్చి ఇక్కడి వ్యాపారుల నడ్డి విరవడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ఉద్యమంలో వ్యాపారులు పాల్గొన లేదా, వారు తెలంగాణ బిడ్డలు కాదా? అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వీరి కుటుంబాలు వీధిన పడాల్సిందేనా? అని ప్రశ్నించారు.
తెలంగాణలోని అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని తెలంగాణ పరిరక్షణ ఉద్యమాన్ని చేపడతామన్నారు. అనంతరం రోడ్డుపై వంటావార్పు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపార సంఘాల ఐకాస నాయకుడు రజినీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, పౌరసంఘాల నాయకులు శేషు తదితరులు పాల్గొన్నారు.