కేసీఆర్ సర్కార్ పతనం వల్ల అందరి కంటే ఎక్కువగా సంతోషించిన వ్యక్తి బహుశా ఆయనే..!!
Prof Kodandaram: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రొనాల్డ్ రాస్.. ఇతర అధికారులు ఈ ఉదయం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోవడం పట్ల తెలంగాణ సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లోని సచివాలయ భవనం వద్ద పెద్ద ఎత్తున విజయోత్సవాలను జరుపుకొన్నారు. స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచాను కాల్చారు. స్టెప్పులేశారు. ఒకరినొకరు అభినందనలు తెలియజేసుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తాము ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నామని, సకాలంలో వేతనాలు అందక అనేక ఇబ్బందులకు గురయ్యామని ఉద్యోగులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని తాము స్వాగతిస్తోన్నామని, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మెరుగైన పరిపాలన అందించగలరని ఆశిస్తున్నటలు తెలిపారు.
ఈ సంబరాల్లో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, టీజేఏసీ మాజీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి ఆయన డాన్స్ చేశారు. తెలంగాణ తల్లికి జిందాబాద్ కొట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆయనను తమ భుజాలపైకి ఎక్కించుకుని, సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. అసలైన బంగారు తెలంగాణ ఇప్పుడు చూడగలుగుతామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అహంకారపూరిత పరిపాలనే ఆయన ప్రభుత్వ పతనానికి దారి తీసిందని చెప్పారు. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా నిలుస్తుందని అన్నారు. ఈ ఎన్నికలకు దూరమైన టీజేఎస్.. కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications