కేసీఆర్.. ప్రధాని మోదీకి గులాంగిరీ చేశారు - పెట్రో ధరల పెంపులో రాష్ట్రానికీ భాగం : రేవంత్ ఫైర్..!!
కేసుల విషయంలో సీఎం కేసీఆర్ కు ప్రధాని సహకారం కావాలని..దానికి ప్రతిఫలంగానే రైతులకు ప్రయోజనాలకు ఉరి వేసే లేఖను ఇచ్చారా అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్ అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం పైన రేవంత్ స్పందించారు. పెట్రోలు ధరల విషయంలో కేసీఆర్ అబద్దాలు చెప్పారంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కలిసే తెలంగాణ రైతులకు ఉరితాళ్లు పేనుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

సీఎంకు ఆ అధికారం ఎవరిచ్చారు
ఇకపై తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం కొనాల్సిందిగా కోరబోమని తానే స్వయంగా కేంద్రానికి లేఖ ఇచ్చినట్టు కేసీఆర్ మీడియా ముఖంగా బహిరంగంగా ఒప్పుకున్నారని, తెలంగాణ రైతుల పక్షాన ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ కొననంటోంది తననేం చేయమంటారని చావు కబురు చల్లగా చెప్పారని విమర్శించారు. ఢిల్లీ కొననంటే దానికి డూడూ బసవన్నలాగా కేసీఆర్ ఎందుకు అనుమతిస్తూ లేఖ ఇచ్చి వచ్చారంటూ రేవంత్ నిలదీసారు.

రైతులకు మద్దుతగా ఎందుకు వెళ్లలేదు
కేంద్ర సాగు చట్టాలపై ఏడాదిగా రైతులు కొట్లాడుతుంటే.. మోదీతో ములాఖత్కు.. మీపార్టీ ఆఫీసు శంకుస్థాపనలకు పదేపదే ఢిల్లీకి పోయిన మీకు రైతులను పరామర్శించాలన్న జ్ఞానం కలగలేదా అంటూ మండిపడ్డారు. ప్రగతిభవన్లో మీరు ప్రెస్మీట్ పెడితే... రైతుల సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆశించామని... కానీ, కేంద్రంతో కయ్యం అంటూ మళ్లీ పాతపాటే పాడారని రేవంత్ విమర్శించారు. ఉప్పుడు బియ్యం తీసుకోవాలని అడగబోం అని కేంద్రం ముందు మోకరిల్లి లేఖ ఇచ్చారంటూ... ఇప్పుడు పోరాటం చేస్తామంటూ బీరాలు పలకడం తెలంగాణ రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారు
పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదని కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, ఒక దఫా రెండు రూపాయలు, మరో దఫా రెండు రూపాయలు పెంచారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట రూ.10తగ్గించారని, కేసీఆర్ సర్కారు సంగతేంటో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేసారు. మద్యం షాపుల లైసెన్సుల రెన్యూవల్పై మీద ఉన్న శ్రద్ధ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సీఎం కు ఎందుకు లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. మీ ఉన్మాద చర్యలు ఏమిటో తెలంగాణ సమాజానికి అర్థం కావడం లేదంటూ ఫైర్ అయ్యారు.
Recommended Video

ఇద్దరూ కలిసే చేస్తున్నారు
ప్రధాని- సీఎం తోడు దొంగలే అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోందని వ్యాక్యానించారు. వరి పంట వేయొద్దు అని చెప్పేవారు.. లక్షల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టో చెప్పాలన్నారు. ఆరు తడి పంటలే వేయాలన్నప్పుడు అంత సాగునీరు కూడా అవసరం లేదు కదా అంటూ ప్రశ్నించారు. కట్టిన ప్రాజెక్టుల లక్ష్యం ఏమిటి.. ఎవడబ్బ సొమ్మును మీరు వృథా చేస్తున్నారంటూ నిలదీసారు.. మొత్తంగా రైతుల పంట కొనుగోళ్లు బాధ్యత నుంచి మెల్లగా తప్పించుకునే కార్యక్రమానికి ఇద్దరూ కలిసి శ్రీకారం చుట్టారన్న విషయం అర్థమవుతోందంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications