Congress: అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామన్న మహేశ్ కుమార్ గౌడ్..
ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందుకోసం కార్యకర్తలు, నేతలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. పార్టీ పదువులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. గాంధీ భవన్ చుట్టూ తిరగకుండా.. ప్రజల మధ్య ఉండాలని సూచించారు. అంతే కాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలన్నారు. కులగణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు.
సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలోనే లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ పదవుల్లో, ఇతర నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా సామాజిక న్యాయం పాటిస్తుందని తేల్చి చెప్పారు. అన్ని సామాజిక వర్గాల వారికి, మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం స్థానాలను గెలుచుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తను త్వరలోనే నియోజకవర్గాల్లో పర్యటిస్తానని మహేశ్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సంక్రాంతి తర్వాత బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళ కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇతర అనుబంధ విభాగాలను కూడా త్వరలోనే ప్రక్షాళన చేస్తామన్నారు.
అన్ని కులాలు, మతాలను గౌరవించడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాతమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభి వృద్ధి లక్ష్యంగా రేవంత్, భట్టి, మంత్రులు పాలన చేస్తున్నారని కితాబు ఇచ్చారు. 2023 లో 22.9 శాతం నిరుద్యోగం ఉంటే 2024 లో దాని శాతం18.1 కి తగ్గుముఖం పట్టిందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications